కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలి

కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలి

శంకరపట్నం ముద్ర జూలై 12:బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన  పిలుపుమేరకు  మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బుధవారం నాడు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డికి శవయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మలు దహనం చేశారు. అనంతరం శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ వ్యవ‌సాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన‌ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ‌ రైతుల ఆర్థిక పురోభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక  పోతుందని అన్నారు.సీఎం కేసీఆర్‌ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుంద‌నిఅన్నారు.కాంగ్రెస్, టీడీపీ పాల‌న‌లో క‌రెంటు లేక రైతులు అరిగోసప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయ‌త్నాలను ప్రజ‌లు, రైతులు తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, సంజీవరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.