మెదక్ నుండే ప్రగతి శంఖారావం

మెదక్ నుండే ప్రగతి శంఖారావం
  • రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం
  • మంత్రి హరీష్ రావు ప్రకటన

ముద్ర ప్రతినిధి, మెదక్:ఏకకాలంలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ నుండి ప్రగతి శంఖారావం పూరిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఇక్కడి నుండి రెండు కొత్త కార్యక్రమాలను సైతం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈనెల 23న మెదక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు  రాధాకృష్ణ శర్మ, దేవేందర్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.  వికలాంగులకు 3016 రూపాయల నుండి 4016కు పెంచడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇప్పటికే బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తుండగా టేకేదార్, ప్యాకర్స్ విజ్ఞప్తి మేరకు వారికి కూడా ఆసరా పింఛన్లు మెదక్ లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో 4016 ఇచ్చే కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంబిస్తారన్నారు. అభ్యర్థుల ప్రకటన, హర్షాతిరేఖాలు మా గెలుపు ధీమాకు నిదర్శనమన్నారు. 

దేశం మొత్తం ఎక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి క్యాడర్ లేదు..కాంగ్రెస్ కు క్యాండిడేట్ లు లేరని మరోసారి పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుదని ఎద్దేవా చేశారు. బీజేపీ డీలా పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందన్నారు. 
సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,మెడికల్ కాలేజీలు,కుల వృత్తులకు రూ.లక్ష ఇచ్చే పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఉహించక విపక్షాలు అగమైపోయాయన్నారు. గ్లోబల్స్ ప్రచారంతో ప్రతిపక్షాలు గెలువాలని చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు మెదక్ జిల్లా ఉన్నా...జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అయిందని, మంజీర, హల్త్ది వాగులపై 14 చెక్ డ్యాములు కట్టినట్లు వివరించారు. 100 కోట్లతో ఘనపురం ఆయకట్టు డెవలప్ చేశామన్నారు. కె అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ రిజర్వాయర్లు, 
బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అయిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలను కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

  •  ఏర్పాట్లు పరిశీలన

సిఎం ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ భవన్, బహిరంగ సభ వేదిక ప్రదేశాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వెంట రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కలెక్టర్ రాజర్షి షా, డీఐజీ రమేష్ నాయుడు, ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. రోడ్డు మార్గాన సీఎం రాక ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదు నుండి మెదక్ రోడ్డు మార్గాన రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుండి ప్రారంభమవుతారు. గుమ్మడిదల వద్ద పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతారని మంత్రి హరీష్ రావు తెలిపారు. నర్సాపూర్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్ పట్టణానికి చేరుకున్న అనంతరం ముందుగా బీఆర్ఎస్ భవన్ ప్రారంభిస్తారని తెలిపారు. 1:20 గంటలకు ఎస్పీ కార్యాలయం ప్రారంభిస్తారు. 1:45 గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వివరించారు. అనంతరం అధికారులతో సమావేశమై వికలాంగులకు పింఛన్ పెంపు, బీడీల టేకేదార్,  ప్యాకర్స్ కు ఆసరా పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సిఎస్ఐ గ్రౌండ్లో  ప్రగతి శంఖారావం పేరిట జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి కెసిఆర్ ప్రసంగిస్తారు.