అయోధ్య రామ భక్తులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ

అయోధ్య రామ భక్తులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ

ముద్ర,తెలంగాణ:- జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ్ మందిర్ ను అట్టహాసంగా ప్రారంభించారు. కాగా తాజాగా అయోధ్య బాల రాముడిని పేరును మార్చారు. ఇక నుంచి బాలక్ రామ్ గా పిలవనున్నారు. అయోధ్యలో బాలక్ రామ్ దర్శనానికి అనుమతించడంతో అయోధ్యకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 17 రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయోధ్యకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేసింది.

అయోధ్యకు దక్షిణమధ్య రైల్వే ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి. ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లు నడువనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడుగా.. ప్రతిరోజు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 9 గంటలన 25 నిమిషాలకు దానాపూర్‌కు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. అదే విధంగా ప్రతి శుక్రవారం నగరం నుంచి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నగరంలో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటుంది.