స్టేట్లో నేషనల్
![స్టేట్లో నేషనల్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f1868f5eb9a.jpg)
- ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్
- ఓరుగల్లులో కాషాయం కవాతు
- మరోసారి రాష్ట్రానికి అమిత్ షా
- విమోచన దినం వేడుకలకు హాజరు
- సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ప్లాన్
ముద్ర, తెలంగాణ బ్యూరో:రాష్ట్రంపై జాతీయ పార్టీలు కన్నేశాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరస పర్యటనలు మొదలుపెడుతున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్షా గత నెల 27న ఖమ్మం సభకు వచ్చి వెళ్లగా, మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్ కీలక సమావేశానికి కూడా హైదరాబాద్వేదిక కానున్నది. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. నిరుటి నుంచి సెప్టెంబర్ 17ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి హైదరాబాద్లో కాకుండా వరంగల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర భద్రత దళాలతో వరంగల్లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పర్యటనలో అమిత్ షా పలు అంశాలపై చర్చించనున్నారు.
సీడబ్ల్యూసీ మీటింగ్ ఇక్కడే
కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ వేదికగా కీలక సమావేశానికి సిద్ధమవుతున్నది. సీడబ్ల్యూసీ సమావేశాలను ఇక్కడే నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 18న నిర్వహించే సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటుగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఇతర నేతలు వస్తారని ప్రాథమికంగా తెలిసింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.