రేవంత్ రెడ్డి మరో కేఏ పాల్

రేవంత్ రెడ్డి మరో కేఏ పాల్

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : హాత్ సే హాత్ జోడో యాత్రలో  రేవంత్ రెడ్డి మాటలు కేఏ పాల్ ను తలపిస్తున్నాయని కరీంనగర్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం స్థానిక తారక్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సోనియా ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. తెలంగాణ వ్యతిరేకి, సమైక్యవాది చంద్రబాబు తో కలిసి కుట్రల పన్నింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నికార్సైన తెలంగాణ ఉద్యమకారులపై పిస్తోల్ తో బెదిరించిన నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డి ది అని మండిపడ్డారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు జీవితం గడిపిన చరిత్ర రేవంత్ ది అన్నారు. కుమ్ములాటలతో దీనస్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జోడయాత్ర చేయాలని అన్నారు. స్కాముల కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారో గుర్తుంచుకోవాలన్నారు. హుజరాబాద్, మునుగోడు ఎన్నికల్లో బిజెపితో కాంగ్రెస్ లోపాయికార ఒప్పందం చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ లో దేశంలోనే తెలంగాణ పోలీస్ మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు ఈ సమావేశంలో గ్రంధాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవెని మధు, నాయకులు ప్రశాంత్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.