గెలుపుకు డోకా లేదు...!

గెలుపుకు డోకా లేదు...!
  • ఓటరు డిసైడ్ అయ్యాడు...!!
  • అభివృద్ధి పై సర్వత్రా హర్షం...!!!
  • పాజిటివ్ దృక్పథంతో పట్టణ ప్రజలు
  • ముఖ్యమంత్రి గా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించ బోతున్నారు
  • ఈనెల 5న 16వ వార్డులో అంతర్గత రోడ్ల దుస్థితిపై ముద్ర కథనం
  • స్పందించిన మంత్రి వార్డులో పర్యటన రోడ్ల పరిస్థితి పై ఆరా -వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం
  • మంత్రి జగదీష్ రెడ్డిని సాదరంగా స్వాగతించి సమస్యలు విన్నవించి వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యుత్ శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన 16 వార్డు ప్రజలు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రానున్న ఎన్నికల్లోనూ బి ఆర్ యస్ గెలుపు నల్లేరు మీద నడకే నని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని ఆయన తేల్చిచెప్పారు. అభివృద్ధిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని,ఆ దిశగా ఫలితాలు రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తాజాగా పట్టణాభివృద్ధికి గాను 30 కోట్లు మంజూరు చేయించిన నిధులను ప్రియారిటీ వారీగా ఎక్కడెక్కడ వెచ్చించాలి అనే అంశంపై ఆయన ఆదివారం ఉదయం సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 16 వ వార్డులో పరిశీలించారు.ప్రాధాన్యత క్రమంలో మంజూరు ఆయిన నిధులను వినియోగించుకునే క్రమంలో ఆ వార్డు పరిధిలోని రహదారులను పరిశీలించారు.

మంత్రి రాకను తెలుసుకున్న వార్డు పరిధిలోని ప్రజలు మంత్రి జగదీష్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాలనీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి పట్టణాభివృద్ధికి ముందేన్నడు లేని రీతిలో 1390 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. దానికి తోడు తాజాగా 30 కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఆ నిధులతో రహదారుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఏ ఒక్క కాలనీని అంతర్గత రహదారులను విస్మరించకుండా ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేయించి పట్టణాభివృద్ధికి కృషి చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు పలువురు మున్సిపల్ కొన్సిలర్స్ మంత్రి జగదీష్ రెడ్డి వెంట వార్డు పర్యటన లో పాల్గొన్నారు.