నా నిర్ణయం ఏమైనా.. అంతా నావెంటే.
![నా నిర్ణయం ఏమైనా.. అంతా నావెంటే.](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650460a173ef6.jpg)
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ అల్టిమేటం
ముద్ర ప్రతినిధి, జనగామ : ‘తెలంగాణ ఉద్యమంలో స్టేషన్ఘన్పూర్ నియోజవర్గ ప్రజలు కీలకంగా పనిచేశారు.. నేను అప్పటి అధికార కాంగ్రెస్లో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లోకి.. నాటి నేటి వరకు ప్రజలతో ఉంటూ పనిచేస్తున్నా.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. వారంతా నా వెంటే ఉంటారు..’ అంటూ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ హైకమాండ్కు అల్టిమేటం ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజయ్యకు ఈ సారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కెటాయించి విషయం తెలిసిందే.
నాటి నుంచి స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. అయితే శనివారం జనగామ జరిగిన మెడికల్ ప్రారంభోత్సవంలో ఈ ఇద్దరు నేతులు ఒకే స్టేజీ మీద ఉండడం అందరి దృష్టిని మళ్లీంచింది. సమావేశంలో ముందుగా మాట్లాడిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సోదరుడు రాజయ్య అంటూ సంబోధిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇక డాక్టర్ రాజయ్య సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూనే.. తన టికెట్ రాలేదనే ఆవేదన వెళ్లబుచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. స్టేషన్ఘన్పూర్ ప్రజలు తన వెంట ఉంటారని చెప్పుకొన్నారు.