రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. జిల్లాకేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న, మున్సిపాలిటీ పరిధిలో గల ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి వారం ఒకరు చనిపోతున్నారని, 2021 లో 51 మంది, 2022 లో 75 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లకు గుర్తించి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారి 353 పరకాల నుంచి కాళేశ్వరం గల రోడ్డుకు ఇరువైపులా ట్రక్ పార్కింగ్ లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ ట్రక్ పార్కింగ్ ఏర్పాటు చేయుటకు పార్కింగ్ స్థలాలు, ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తయారుచేసి జాతీయ రహదారుల అధికారులకు సమర్పించాలని ఆదేశించారు.

జాతీయ రహదారి 353 వెంట ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో  రేడియం సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని చెప్పారు. పట్టణాలలో రోడ్డు పై ఉన్న అనవసర బ్యానర్లు, ఫ్లెక్సీలు తోలగించాలని సూచించారు.

రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో టి జంక్షన్ రోడ్ల వద్ద  అవసరమైన స్పీడ్ బ్రేకర్, రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని,  సరుకు రవాణా వాహనాలు ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, జిల్లాలోని ప్రతి విద్యాసంస్థలో రోడ్డు భద్రత ప్రమాణాల పై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి,  జిల్లా రవాణా అధికారి వేణు, మున్సిపల్ కమిషనర్ అవినాష్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేష్, ఆర్.టి.సి. డి.ఎం., సిబ్బంది పాల్గొన్నారు.