అశ్రునయనాల మధ్య ఆ నలుగురికి అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య ఆ నలుగురికి అంత్యక్రియలు

నివాళి అర్పించిన ఎమ్మెల్యే  సతీష్ కుమార్ 

సిద్దిపేట :  ముద్ర ప్రతినిధి రోడ్డు ప్రమాద మృతులకు కుటుంబీకులు, గ్రామస్తులు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు.
 మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఆ నలుగురు సోదరులు మృతి చెందిన సంఘటన ముద్ర పాఠకులకు తెలిసిందే. గురువారం మధ్యాహ్నం చౌటపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రాల్లో ఒకే చోట నాలుగు చితులు పేర్చి నలుగురి అంత్యక్రియలను నిర్వహించారు. తన శాసనసభ పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్, సంజయ్ గౌడ్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో ఔరంగాబాద్ వద్ద మరణించిన విషయం  తనను ఎంతగానో కలచివేసిందని, ఈ ప్రమాదం, సంఘటన అత్యంత దురదృష్టకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఆ నలుగురు సోదరుల మృత దేహాలు గురువారం గ్రామానికి చేరుకోగానే బాధిత కుటుంబాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. మృత దేహాలకు నివాళులర్పించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యే కూడా అంత్యక్రియలకు వచ్చిన సందర్భంగా సందర్బంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.