ధాన్యం సేకరణలో సహకార శాఖ ఉద్యోగుల సేవలు అభినందనీయం
ముద్ర ప్రతినిధి, మెదక్: రైతులు పంట పండించిన ధాన్యాన్ని సేకరించడంలో జిల్లా సహకార శాఖ ఉద్యోగుల సేవలు అభినందనీయమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. మంగళవారం స్థానిక టీఎన్జీవో భవన్లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధాన్యం సేకరణతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి, మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకం దారులు, పాల ఉత్పత్తి దారులు, గీత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ.. అటు అధికారుల ఇటు ప్రజల మన్ననలు పొందిన ఘనత సహకార శాఖ ఉద్యోగులకే దక్కుతుందన్నారు.
అనంతరం సహకార శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల రామాగౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, ఇరిగేషన్ డీఏవో తోట కుమార్ నీలతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు గాండ్ల అనురాధ, కార్యాలయ కార్యదర్శి కోటి రఘునాథరావు, సహకార శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్, రాజేష్, శివకుమార్, దినేష్, పాష తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.