సారూ.. జీతం రాలే.. | Mudra News

సారూ.. జీతం రాలే..  | Mudra News

ముద్ర, తెలంగాణ బ్యూరో : జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతున్నదని అధికారులు చెబుతున్నా  ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలు ఆలస్యమవుతూనే ఉన్నాయి. గతంలో జిల్లాలవారీగా జీతాలిచ్చినా,  కొంతకాలం నుంచి ఎస్టీఓల వారీగా చెల్లింపులు మొదలుపెట్టారు. అయినప్పటికీ 22 జిల్లాల పరిధిలోని ఎస్టీఓలలో ఇప్పటి దాకా ఒక్క శాఖకు కూడా జమ చేయలేదు. కొన్ని జిల్లాలలో ఒకటీ, రెండు ఎస్టీఓల పరిధికి చెక్కులిచ్చారు. దీంతో గురువారం రాత్రి వరకు 22 జిల్లాలలో ఉద్యోగులకు జీతాలు జమ కాలేదు. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నిరుడు అక్టోబర్, నవంబర్ నెలలలో నాలుగవ తేదీలోగా జీతాలిచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరుగుతోందని ప్రభుత్వం పదే పదే చెబుతుండడంతో ఉద్యోగులు ఇక నుంచి తొలి వారంలో జీతాలు వస్తాయని ఆశపడ్డారు. ఇప్పుడో, అప్పుడో  జీతాలు పడుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. సాలరీ క్రెడిట్​మెస్సేజ్‌ లు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఖర్చులున్నాయని, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని ఉద్యోగులు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలకు మొర పెట్టుకుంటున్నారు. గురువారం సాయంత్రం వరకు  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలకు మాత్రమే జీతాలు జమయ్యాయి.

11 జిల్లాలకే
రాష్ట్రంలోని 11 జిల్లాలలో కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే గురువారం రాత్రి వరకు వేతనాలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని హెచ్ఓడీ విభాగాలకు మాత్రం ఇచ్చారు. అంతేకాకుండా, పలు జిల్లాలలో కొన్ని శాఖలకు ఎస్టీఓల నుంచి చెక్కులు జమ చేశారు. దీంతో ఒక్కో జిల్లాలోని ఒకటీ, రెండో ఎస్టీఓల పరిధిలో మాత్రమే కొంతమందికి వచ్చాయి. అంతేకానీ మొత్తం జిల్లాలోని ఉద్యోగులకు జీతం చేతికందలేదు. ప్రస్తుతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది.  

డీఏ వచ్చినట్టా.. రానట్టా?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా రెండు నెలల డీఏ పెండింగ్​ఉంది. అయితే, 2022 జనవరికి సంబంధించిన డీఏను విడుదల చేయాలని కేబినెట్​నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయాన్ని ప్రకటించాయి. కానీ, డీఏ విడుదలపై ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేదు. జీఓ కూడా జారీ కాలేదు. దీంతో ఈ నెల వేతనాలలో డీఏ కలువనట్టేనని తేలిపోయింది. 

పెన్షనర్లకు లేవు
ప్రభుత్వ పెన్షనర్లకు ఇంకా అసలే పింఛన్లు విడుదల కాలేదు. రెండున్నర లక్షల మంది పింఛన్ దారులు తమ పింఛన్​కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిటైర్డ్​గెజిటెడ్​ అధికారులు సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపించారు. ప్రతి నెలా ఒకటిన పెన్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీఏలు కూడా ఇవ్వాలని విన్నవించారు. ప్రస్తుతం ఇంకా పెన్షన్లు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నారు.