భూ తగాదాలతో అధికార పార్టీ వార్డు సభ్యుడి పై దాడి

భూ తగాదాలతో అధికార పార్టీ వార్డు సభ్యుడి పై దాడి

కేసముద్రం, ముద్ర: భూతగాదాలతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గుంజపడుగు రాజశేఖర్ పై కొందరు సోమవారం ఉదయం దాడి చేసి కొట్టారు. తమకు చెందిన భూమిని అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేశాడని ఆరోపిస్తూ రాజశేఖర్ పై కొందరు దాడికి పాల్పడినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు. గాయపడ్డ రాజశేఖర్ ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వార్డు సభ్యుడు రాజశేఖర్ దాడి ఘటన కేసముద్రం మండల కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా కేసముద్రం మండల కేంద్రంలో భూ దందాలు, కబ్జాల పర్వం యదేచ్ఛగా సాగుతున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వార్డు సభ్యుడిపై దాడి ఘటన పరాకాష్టకు చేరాయనే విమర్శలు వస్తున్నాయి.