ఉద్యోగుస్తులారా మీ కోసం మేం జైలుకెళ్లేందుకు సిద్ధం -మీరంతా బీజేపీతో పోరాడేందుకు రోడ్డెక్కండి

ఉద్యోగుస్తులారా మీ కోసం మేం జైలుకెళ్లేందుకు సిద్ధం  -మీరంతా బీజేపీతో పోరాడేందుకు రోడ్డెక్కండి

-జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ న్యాయబద్దమే

-తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయాల్సిందే

-లంచాలివ్వనిదే కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పని కావడం లేదు

-సీఎం కుటుంబానికి లంచమిస్తే కార్యదర్శులను కూడా రెగ్యులరైజ్ చేస్తారేమో

-బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటన జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేస్తాం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

-పంచాయతీ కార్యదర్శుల సమక్షంలోనే సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేసిన బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: ‘‘ఉద్యోగులారా... భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందే. తెలంగాణ కోసం మీరు చేసిన పోరాటాలను ఒక్కసారి గుర్తుకు  తెచ్చుకోండి. ఆ పోరాట పటిమను మళ్లీ చూపండి. మీకు అండగా మేమున్నాం. బీజేపీ చేస్తున్న తెలంగాణ మలిదశ పోరాటంలో భాగస్వాములు కండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలోని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదేనని, వారికి బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు. తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖను జూనియర్ కార్యదర్శుల సమక్షంలోనే మీడియాకు విడుదల చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు డిమాండ్ సమంజసమైనదే. పోటీ పరీక్షలు పాసై అన్ని అర్హతలు సాధించిన జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయి నాలుగేళ్లయినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం.
కేసీఆర్ సీఎం అయ్యాక ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ పర్మినెంట్ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పారు. మాట తప్పారు. 

గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ది పనుల్లో మీ పాత్ర కీలకం. కేంద్రం పంచాయతీలకు అవార్డులిస్తోందంటే కారణం మీరే తప్ప సీఎం తట్టమోయలేదు. మీరు తల్చుకుంటే ఏదైనా సాదించవచ్చు. ప్రభుత్వాన్ని కూల్చేవచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా మీరు సమ్మె చేస్తున్నారు. అయినా మీకు, రెగ్యులర్ కార్యదర్శులకు మధ్య కొట్లాడ పెడుతున్నరు. ఇది దుర్మార్గం.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న న్యాయబద్దమైనదే. ఎక్కడైనా ప్రొబేషనరీ పీరియడ్ రెండేళ్లే ఉంటది. నాలుగేళ్లు పూర్తయినా ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు?
కేసీఆర్ పాలనలో సింగరేణి, విద్యుత్, ఆర్టీసీసహా అన్ని వర్గాల ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నరు. రొడ్డెక్కే పరిస్థితి వచ్చింది. 

ఉద్యోగులారా... భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందే. తెలంగాణ కోసం మీరు చేసిన పోరాటాలను ఒక్కసారి గుర్తుకు  తెచ్చుకోండి. ఆ పోరాట పటిమను మళ్లీ చూపండి

సీఎం కుటుంబం వేల కోట్లు దోచుకుంటోంది. అందులో ఒక్క శాతం ఇస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. కేసీఆర్ పాలనలో లంచాలివ్వనిదే ఏ పని కావడం లేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కలిసి కేసీఆర్ కుటుంబానికి ఒక నెల లంచమిస్తే పర్మినెంట్ చేస్తారేమో... బీఆర్ఎస్ లో దళారీలు ఉన్నారు. వాళ్లను పట్టుకుంటే పనవుతుందేమో..
పంచాయతీ కార్యదర్శులతో గొడ్డు చాకిరీ చేయించుకుని రెగ్యులరైజ్ చేయకపోవడం దుర్మార్గం. పవిత్రమైన దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా రెగ్యులరైజ్ చేస్తానన్న హామీని అమలు చేయకుండా వాళ్లతో చాకిరి చేయించుకుని రాక్షసానందం పొందడం దుర్మార్గం.

కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆయన సంగతి చూసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కార్యదర్శులు చేసే ఉద్యమానికి బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోంది. మిమ్ముల్ని (కార్యదర్శులను ఉద్దేశించి) సస్పెండ్ చేస్తే... మీరేం భయపడకండి... మీ తరపున మేం ఉద్యమిస్తాం.. మేం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మిమ్ముల్ని బెదిరిస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం. 
మాకు జైలు కొత్తకాదు. కేసులు కొత్తకాదు. 317 జీవో విషయంలో ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లినం. నిరుద్యోగుల కోసం జైలుకు పోయినం. రైతుల కోసం లాఠీదెబ్బలు తిన్నం. రౌడీషీట్లు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసినా వెనుకాడేది లేదు. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలే. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసి తీరుతాం. వారి న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం.
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒక్కటే చెబుతున్నా... సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ కార్మికులుసహా ఉద్యోగస్తులంతా తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలను గుర్తుకు తెచ్చుకోండి. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మలిదశ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.
తెలంగాణలో ప్రజలకు, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను ఏం చేసినవో చెప్పకుండా కర్నాటక ఎన్నికల సంగతి, అక్కడ హామీల సంగతి నీకెందుకు? మీ అయ్య తాగుతున్న బాటిల్ సంగతి చెప్పు. ఇక్కడ సంపాదించిన సొమ్మునంతా మీ అయ్య కర్నాటకలో పంచుతున్న విషయం వాస్తవం కాదా? బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులించేందుకు సిద్ధమని మీ అయ్య సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తో చెప్పిన విషయం వాస్తవం కాదా? అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.