సిరిసిల్ల"  గుడిసెలేని నియోజకవర్గం కావాలి

సిరిసిల్ల"  గుడిసెలేని నియోజకవర్గం కావాలి
  • తరతమ భేదాలు పక్కనబెట్టి ....
  • పార్టీలకు అతీతంగా నిరు పేదలకు గృహలక్ష్మి ఇండ్లను ఇవ్వాలి.
  • గ్రామాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు టీమ్ వర్క్ గా పని చెయ్యాలి
  • సిరిసిల్ల కు వరద ముంపు లేకుండా శాశ్వత ప్లడ్ మేనేజ్మెంట్ చేస్తాం. ఈఎన్సీ చే క్షేత్ర అధ్యయనం చేసి డిజైన్ చేయిస్తాం
  •  సిరిసిల్ల సమావేశంలో మంత్రి  కే తారక రామారావు 

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: తరతమ భేదాలు పక్కనపెట్టండి... పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద  ఇండ్లను మంజూరుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు టీమ్ వర్క్ గా పని చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్ ఛాంబర్ లో గృహలక్ష్మి పథకం పై ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, కౌన్సిలర్ లు, సెస్ డైరెక్టర్ లు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.గృహలక్ష్మి పథకం లో గైడ్ లైన్స్ స్పష్టంగా ఉన్నాయన్నారు. 

సిరిసిల్ల మున్సిపాలిటీ లో ఇంటింటా సర్వే చేస్తే 2,800 మంది ఇండ్లు లేని పేదలు ఉన్నట్లు తేలిందన్నారు. వారిలో ఇప్పటికే 2 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేశామన్నారు. గృహలక్షి పథకం కింద నియోజక వర్గం కు 3 వేల చొప్పున ఇండ్లు ఇప్పటికే మంజూరు అయినందున స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు టీమ్ వర్క్స్ గా జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఇండ్లను మంజూరు చేయాలని చెప్పారు .గుడిసెల్లో నివసిస్తున్న వారికి, శిథిలావస్థలో ఇండ్లున్న వారికి  ఇండ్ల మంజూరులో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు లబ్ది చేకూరిన వారికి తదుపరి ఇండ్లను కేటాయించాలనీ చెప్పారు.అలాగే 40 రోజుల్లో రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేయనుందని మంత్రి తెలిపారు.

బివై నగర్, సుందరయ్య నగర్, పద్మనగర్ లలో పొజిషన్ లో ఉన్న 4 వేల 200 మందికి రిజిస్ట్రేషన్ అయి బ్యాంక్ లోన్ లు వచ్చేలా  పట్టాలు అందజేస్తామని చెప్పారు.ఈ నెల 15 వ తేదీ లోగా దీనికి సంబంధించి ప్రభుత్వ జీఓ జారీ అయ్యేలా చూస్తామని అన్నారు. సిరిసిల్ల వరదలపై సమీక్ష జరిపారు. శాశ్వాత పరిష్కారం కోసం ఈఎన్సీ చే డిజైన్ చేయించి .. పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీపీలు ,జడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్ లు, సెస్ డైరెక్టర్ లు ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. 

కాళేశ్వరం  ప్రాజెక్టు పనులు జిల్లాలో దాదాపు పూర్తయిన దృష్ట్యా ఈ ప్రాజెక్టు వల్ల కలిగిన, కలగబోవు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు , టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.