రేషన్ డీలర్లతో మొదలైన చర్చలు
![రేషన్ డీలర్లతో మొదలైన చర్చలు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647ef015eacd7.jpg)
- సమ్మె విరమించేందుకు ససేమిరా
- 22 డిమాండ్లపై చర్చిస్తున్న మంత్రి గంగుల
ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ డీలర్ల సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చింది. దాదాపు 10 రోజుల నుంచి రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు డీలర్ల అసోసియేషన్తో మంత్రి గంగుల కమలాకర్ చర్చించారు. తమ డిమాండ్లపై మంత్రి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తామని డీలర్లు ప్రకటించారు. కానీ, ప్రభుత్వం మాత్రం సమ్మె వాయిదా వేస్తున్నారంటూ చెప్పింది. రేషన్ డీలర్లు మాత్రం సమ్మెకు దిగి, షాపులకు తాళాలు వేశారు. ఈ నెల మొదటి నుంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, డీలర్లు కనీసం డీడీలు కూడా తీయలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం చర్చలకు పిలిచారు. ఈ సందర్భంగా డీలర్లు సమ్మె విరమించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు.
అయితే, చర్చల సందర్భంగా రేషన్ డీలర్లు 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. వీటిలో 20 డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమలుకు సాధ్యం కాని డిమాండ్లపై మొండి పట్టు పట్టడం సరికాదని మంత్రి డీలర్లకు సూచించారు. వెంటనే రేషన్ షాపులు తెరిచి, సరుకులు పంపిణీ చేయాలని, ప్రభుత్వానికి సహకరించాలని గంగుల వారిని కోరారు. దీనిపై డీలర్లు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.