చేప మందు పంపిణీ ప్రారంభించిన మంత్రి తలసాని
మృగశిర కార్తె సందర్భంగా అందించే చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభించారు. బత్తిని కుటుంబ సభ్యులు చేప మందును ఉచితంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కరోనా నేపథ్యంలో మూడేండ్ల విరామం తర్వాత శుక్రవారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజులపాటు చేప మందును అందించనున్న నేపథ్యంలో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చేప మందుకోసం గురువారం నుంచే దేశం నలుమూలల నుంచి ప్రజలు నగరానికి తరలివస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులను ఏర్పాటు చేశారు.