దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్ము దుర్వినియోగం
![దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్ము దుర్వినియోగం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6484966388a5e.jpg)
- ప్రజాధనాన్ని దుబారా చేయడం ఓట్ల కోసం వేసే గాలమే.
- ఉత్సవాల పేరుతో దుబారా ఖర్చును వెంటనే ఆపాలి..
- ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
కోదాడ, ముద్ర: ప్రజాధనం అత్యంత నిరుపేదల సంక్షేమానికి ఉపయోగించాలి తప్ప దశాబ్ది ఉత్సవాల పేరుతో జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం సరైనది కాదని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉత్సవాల పేరుతో చేస్తున్న ఖర్చును అనాధ పిల్లల సంక్షేమానికి వెచ్చించాలన్నారు. దుబారా ఖర్చులు ఆపేసి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలుకు ఇచ్చే సామాజిక పెన్షన్లు అన్నింటిని 6 వేలకు పెంచాలన్నారు. ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని ఉత్సవాల పేరుతో దుబారా చేయడం ఓట్ల కోసం వేసే గాలమేనాని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి తొమ్మిది ఏండ్లు అవుతుందన్నారు. నేడు అనాధాశ్రమాల్లో దాతలు సహకరించిన రోజు తింటూ లేని రోజు పస్తులు ఉంటూ అనాధలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో కెసిఆర్, కేటీఆర్, మంత్రి మండలి అనాధలకు ఇచ్చిన హామీలు అడ్రస్ లేకుండా పోయాయని అన్నారు.
హామీలు అమలు చేయనందుకు నిరసనగాజూన్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఎస్పి కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏపూరి రాజు మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు యలమర్తి రాము,ఎం ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి. వెంకటేశ్వర్లు మాదిగ,వీహెచ్ పి యస్ జాతీయ నాయకులు కర్ల విజయరావు, బొడ్డు కుటుంబరావు, పులి నాగేశ్వరరావు, కొలిక పంగు. ఉపేందర్, పందింటి నవీన్, చేకూరి రమేష్, పాతకోట్ల ప్రకాష్, పులి వెంకటేశ్వర్లు, ఏపూరి పర్వతాలు, కొత్తపల్లి అంజయ్య, లంజపల్లి శ్రీను, మీసాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.