పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..
- ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పుట్టినవే...
- ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్.
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా, ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ప్రజలను నిరాశపర్చాడని, తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పుట్టినవే ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డ్ అని, అవి ప్రకటించే ముందు ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రధానమంత్రి మోడీ ప్రకటించి ఉంటే బాగుండునీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీ తెలంగాణకు ఏదో వరాలిచ్చాడని బిజెపి నాయకులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉన్నదని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూలుగు జిల్లాలో 50 ఎకరాల స్థలం కేటాయించామని, ఇందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పుడు పార్లమెంట్ సభ్యులు ప్రధాని చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కూడా ఏర్పాటు చేయలేదని, ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని అన్నారు.
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది బిఆర్ఎస్ ఎంపీలని, అందులో ముఖ్యంగా కవిత పాత్ర ఎక్కువగా ఉందని అన్నారు. ఆనాడు వరంగల్ ఎంపీగా ఉన్నప్పుడే వరంగల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయించామని, పసుపు బోర్డు ఆలోచన తీసుకువచ్చిందే టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. , ఇన్ని రోజులు తెలంగాణపై కసితోనే ఇప్పటివరకు ప్రకటించలేదని,ఇప్పుడు ప్రకటించడం ఎలక్షన్ స్టంటేనని ప్రజలకు అర్థమయిందనిఅన్నారు.ప్రధానమంత్రి మోడీ మహబూబ్నగర్ వస్తున్న సందర్భంగా పాలమూరుకు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని ఆశించామని కానీ ఇవ్వలేదని అన్నారు.గోదావరిపై నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు, కృష్ణా నదిపై నిర్మించిన పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో కొట్లాడామని, అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రకటించారని, కానీ ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని అన్నారు.
కృష్ణా నదిపై నిర్మించే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ, ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తుందని తెలంగాణ ప్రజలు ఆశించారని అన్నారు. కృష్ణానది జలాల వాటను పంపకాలు చేపట్టాలని 2014లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రధాని మోడీకి వినతి పత్రం ఇచ్చామని, పంపకాలపై పాలమూరు సభలో ప్రకటిస్తారని అనుకున్నామనికానీ మోడీ ప్రకటించలేదని అన్నారు. ఒకప్పుడు మహబూ నగర బీడు వారిని జిల్లాగా ఉండేదని, ఇక్కడి నుంచి కార్మికులు దేశవ్యాప్తంగా వలస వెళ్లారని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు సస్యశ్యామలంగా మారి వలసలు తగ్గాయని అన్నారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు ప్రధానమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.