జీఓలే కాదు.. సమాచారం కూడా సీక్రెట్​

జీఓలే కాదు.. సమాచారం కూడా సీక్రెట్​
  • పైసల ఖర్చు వివరాలు ఇవ్వని సర్కారు
  • చిన్న చిన్న అంశాల్లోనూ అదే తంతు
  • గోశాల నిర్వహణ ఖర్చులు లేవంట
  • పశుసంవర్థక శాఖ నుంచి సమాధానం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాచారమైనా దాచిపెడుతుంది. ఏ స్కీమ్ ద్వారా ఏ జిల్లాలో ఏయే పనులు చేస్తున్నారనే విషయాలనూ బయటకు చెప్పడం లేదు. వెబ్​సైట్​లోనూ వివరాలను అందుబాటులో పెట్టడం లేదు. శాఖల వారీగా ఉన్న వెబ్​సైట్లన్నీ సీక్రెట్​ చేస్తున్నది. ఒక్క శాఖకు సంబంధించిన దాంట్లోనూ ఏ వివరాలు పెట్టడంలేదు. కనీసం సర్కారు ఇచ్చిన జీఓ కూడా అందుబాటులో లేదు. ఇప్పటికే 72 వేలకుపైగా జీవోలను రహస్యంగా దాచి పెట్టింది. తాజాగా శాఖల్లోని సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పాలనంతా చీకటిమయంగా మారింది. 

పైసల వివరాల్లేవ్​
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రజలకు సేవకులనే విషయాన్నే మరిచిపోతున్నారు. ప్రభుత్వ శాఖకు సంబంధించిన తగిన సమాచారం తమ దగ్గర లేదని ఖరాఖండిగా చెపుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో ఎన్ని గోశాలలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నిర్వహణ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఖర్చుల వివరాలను, గోశాల వివరాలను తెలపాలని యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ సమాచారహక్కు చట్టం ద్వారా రాష్ట్ర పశువైద్య, పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసింది. కాని ఆ శాఖ అధికారులు మాత్రం సగం సమాధానమే ఇచ్చి, మిగతా సగం తమ దగ్గర లేదని సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారులను అడిగినా సమాధానం ఇవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఈ సందర్భంగా వెల్లడించారు. 

అంతా వింతగా
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 221 గోశాలలు ఉన్నాయని, వివిధ గోశాలలో ఉన్న పశువుల సంఖ్య మొత్తం 30,973 అని సమాధానం ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని ఈ గోశాల నిర్వహణకు ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం తమ దగ్గర లేదు అని సమాధానం ఇచ్చారు. కనీసం జిల్లాలలోని గోశాలలకు సంబంధించిన సమాచారం ఇవ్వమని అడిగినా ఆ సమాచారం కూడా తమ శాఖ వద్ద అందుబాటులో లేదని ప్రజా సమాచార అధికారి రామచందర్ వెల్లడించారు. దీంతో పశుసంవర్థక శాఖ పరిస్థితి వింతగా ఉంది. రాష్ట్రంలో ఉన్న గోశాలల సంఖ్య, ఆ గోశాలలో ఎన్ని పశువులు ఉన్నాయో వివరాలు ఉన్నాయని చెప్తున్నారే తప్ప.. వాటి ఖర్చుల వివరాలు లేకపోవడం మాత్రం మరీ విచిత్రంగా ఉంది. నిధులను ఖర్చు చేయడంలో ఏదైనా గోల్ మాల్ జరిగే అవకాశం ఉంటుందని అందుకే ఖర్చుల సమాచారం ఇవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర చెప్తున్నారు.