పథకం ప్రకారమే ఆరుగురి హత్య !   

పథకం ప్రకారమే ఆరుగురి హత్య !   
  • హత్యల్లో ప్రధాన నిందితుడితో పాటు పాల్గొన్న మరో నలుగురు
  • నిందితుల్లో మైనర్ బాలుడు     
  • విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ   

                 
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భూంపల్లిలో జరిగిన యువతి హత్య ను ఆధారంగా చేసుకొని పోలీసులు చాకచక్యంగా ఈ కేసును ఛేదించి మిగితా ఐదుగురి హత్యలను, నిందితులను అరెస్టు చేయడంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ సదాశివనగర్ ఎస్సై, సీఐలను అభినందించారు. ఈమేరకు  కామారెడ్డి ఎస్పీ మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరుగురి హత్య కేసు వివరాలు వెల్లడించారు.  ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  ఈనెల 14-12-2023 నాడు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పద్మాజివాడ నుండి గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మహిళ  శవం కాల్చి వేయబడి ఉందని సమాచారం రాగా, సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బందితో సహా అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా, ఒక గుర్తు తెలియని యువతి వయసు సుమారు 20-25 సంవత్సరాలు గల ఆమెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి పెట్రోలు తో కాల్చివేసినట్టుగా గుర్తించారు. ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పి,  యువతి వివరాలు, కేసుని ఛేదించడం మోసం సీఐ సదాశివ నగర్, ఎస్సై సిబ్బంది తో టీములుగా ఏర్పాటు చేశారు. టీమ్ లుగా ఏర్పడిన అధికారులు అన్ని రకాలుగా విచారణ చేసి, క్లూ లు సంపాదించి, మంగళవారం గాంధారి x రోడ్డు వద్ద ఈ నేరానికి పాల్పడిన నేరస్థుడు అయిన మేడిద ప్రశాంత్ ను, అతనితో పాటు ఉన్న మరో నలుగురిని ఈ రోజు ఉదయం 04:30 గం. లకు పట్టుకోవడం జరిగింది.మేడిద ప్రశాంత్ అతనితో పాటు ఉన్న గుగులోతు విష్ణు, బానోతు వంశీలను పూర్తిస్థాయిలో విచారణ చేయగా వారు చేసిన హత్యకు సంబంధించిన వివరాలను తెలిపారు. 

                                               
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని....   
                
మేడిద ప్రశాంతు మాక్లూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. అదే గ్రామానికి చెందిన పూనే ప్రసాద్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. అయితే 2018 సంవత్సరంలో పూనే ప్రసాద్ అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో అతనిపై కేసు నమోదైంది.  ప్రసాద్ అప్పటికే దుబాయ్ వెళ్లిపోగా అతనిపై కేసు పెండింగ్ ఉంది.  ప్రసాద్ ప్రశాంత్ తో మాట్లాడుతూ కేసు వివరాలు, ఊర్లో పరిస్థితిని తెలుసుకున్నాడు. తిరిగి ప్రసాద్ 2022 అక్టోబర్ నెలలో భారతదేశం రాగా అతనిని మాక్లూర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతకుముందు ప్రసాద్ దుబాయ్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ కు దాదాపుగా మూడు లక్షల 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ కుటుంబాన్ని గ్రామస్తులు ఊళ్లో ఉండనీయకపోవడం వల్ల, ప్రసాద్ అతని భార్య, పిల్లలు, ఇద్దరు చెల్లెల్లు, తల్లితో సహా మాచారెడ్డి పి‌ఎస్ పరిదిలో ఉన్న పాల్వంచ గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే జైలుకు వెళ్లడం, ఊళ్లో ఉండకపోవడం వల్ల ప్రసాద్ కి అప్పులు ఎక్కువ కావడం వల్ల, ప్రశాంత్ కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ప్రశాంత్ తన వద్ద డబ్బులు లేకపోవడంతో రేపు మాపు అంటూ కాలం గడిపాడు. ఈ క్రమములోనే ప్రసాద్ కు ఉన్న ఇల్లు, స్థలాన్ని తాకట్టుపెట్టి డబ్బులు ఇవ్వాలని తెలిసిన వారి వద్ద ప్రయత్నం చేయగా, ఎవరు కూడా వాటిని కొనడం గాని, కుదవ పెట్టుకోవడం గాని చేయలేదు. ఈ క్రమంలోనే ప్రసాద్ ప్రశాంతును సంప్రదించగా, ప్రశాంత్ మార్టిగేజు పెట్టి లోన్ తీసుకోవచ్చు అని, ఆ ల్యాండ్ ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తే లోను కూడా ఇప్పిస్తానని చెప్పగా, ప్రసాద్ ఆ భూమిని ఇంటితో సహా ప్రశాంత్ పేరు మీద ఈ సంవత్సరం మే నెలలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. దీని విలువ మార్కెట్ లో సుమారు 20-25 లక్షల వరకు ఉంది. అప్పటినుండి లోను ఇప్పిస్తానంటూ కాలయాపన చేశాడు. ప్రసాద్ తనకు కచ్చితంగా డబ్బులు కావాలని, లోన్ అయిన ఇప్పియ్యాలని ప్రశాంత్ ని అడగగా, ఎప్పటి నుండో ప్రశాంత్ ప్రసాద్ యొక్క ఆస్తి పైన కన్ను వేసి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, ఊర్లో ఎలాగూ వీళ్లను రానివ్వరనే ఉద్దేశంతో, అతని ఆస్తి దక్కించుకోవాలని అనుకోని, అతడిని చంపివేస్తే ఊర్లో అతడిని గురించి గాని, అతని ఆస్తిని గురించి గాని అడిగేవారు గాని ఉండరని అనుకున్నాడు.
ప్రసాద్ ను, అతని కుటుంబ సభ్యులను చంపివేస్తే ఆ ఊర్లో ఉన్న ఆస్తి,  డబ్బులు తానే దక్కించుకోవచ్చని అనుకున్నాడు. అతని ప్లాన్ లో భాగంగా ఈ విషయాన్ని తనకు పరిచయం ఉన్న దుర్గా నగర్ తాండాకు చెందిన బానోతు వంశీ, గుగులోతు విష్ణులకు తెలియజేయగా, వారు డబ్బులు ఇస్తే ప్రశాంత్ తో పాటుగా వస్తామని చెప్పగా, వారికి 60 వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్న విధంగా సమయం కోసం ఎదురుచూస్తూ ఉండగా, ఎలక్షన్ సమయం రావడంతో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రసాద్ ని చంపాలని అనుకున్నారు. కానీ ప్రసాద్ ప్రతిరోజూ ప్రశాంత్ కి ఫోన్ చేస్తూ, డబ్బులు ఇవ్వాలని సతాయించడం ప్రారంభించగా, ఎలాగైనా అతడ్ని చంపాలని అనుకున్నాడు. అనుకున్న విధముగానే, గత నెల 29వ తారీఖు నాడు మాక్లూర్ కి ప్రసాద్ వచ్చి, ప్రశాంత్ ని కలిసి, తనకు ఈరోజు ఎలాగైనా సరే డబ్బులు ఇవ్వాలని అడగగా, ఇదే సరైన సమయం అని అనుకోని ప్రశాంత్ అదే విషయాన్ని వంశీ, విష్ణు లకు చెప్పగా, అదే రోజు నలుగురు కలిసి నిజామాబాద్ వెళ్లి, అక్కడ ఒక కారును రోజువారి అద్దెకు తీసుకొని, నలుగురు కలిసి అదే కారులో తిరిగి సాయంత్రానికి మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వారితో తెచ్చుకున్న మద్యాన్ని ప్రసాద్ కి తాగించిన తర్వాత, ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముగ్గురు కలిసి ప్రసాద్ ని కట్టేతో, రాళ్లతో తలపై కొట్టి చంపివేసి, అక్కడే చెట్ల పొదల్లో పడేసి, మధ్య రాత్రి తర్వాత ఊళ్లోకి వెళ్లి పార, గడ్డపార తీసుకువచ్చి, అక్కడే అడవిలో గోతి తవ్వి పాతి పెట్టి, అక్కడినుండి వెళ్ళిపోయారు. 

ఆ తర్వాత ప్రసాద్ కనబడని విషయం గురించి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తారని అనుకొని, తేదీ 01-12-2023 నాడు పాల్వంచ గ్రామానికి ప్రశాంత్ ఒక్కడే కారులో వచ్చి, ప్రసాద్ ఊర్లో అయిన కేసు విషయంలో పోలీసులు అతని గురించి తిరుగుతున్నందున ఒక దగ్గర దాక్కొని ఉన్నాడని, ప్రశాంత్ భార్య అయిన శాన్విక, చెల్లెలు శ్రావణిని తన వెంట తీసుకొని నిజామాబాద్ వెళ్ళినాడు. నిజామాబాదులో శ్రావణిని ఒక స్థలంలో ఉంచి, శాన్వికను భర్త దగ్గరికి తీసుకువెళ్తానని నమ్మబలికి, ముగ్గురు కలిసి శాన్విక ని తీసుకొని బాసర బ్రిడ్జి వైపు వెళ్లి, మార్గమధ్యలో అనుకున్న ప్రకారంగా శాన్విక గొంతుకి తాడుతో బిగించి చంపేసి, బాసర బ్రిడ్జిపై నుండి నీళ్లలో పడవేసినారు. ఆ తర్వాత తిరిగి శ్రావణి ఉన్న ప్రాంతానికి వచ్చి, అక్కడ శ్రావణి తో శాన్వికను ప్రసాద్ దగ్గర వదిలినామని చెప్పి, మనం ఇక్కడి నుంచి వెళ్దామని ఆమెను తీసుకొని ముగ్గురు కలిసి కారులో ఆమెని అనుకున్న విధంగానే ఆమెను తాడుతో గొంతు బిగించి చంపేసి, చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఎన్‌హెచ్-44 రోడ్ పక్కన తీసుకువెళ్లి, వారితో తెచ్చుకున్న పెట్రోల్ ని ఆమెపై పోసి తగలబెట్టి ఎవరికి తెలియనట్టుగా అక్కడినుండి మాక్లూర్ వెళ్ళినారు.
ఆ తర్వాత ప్రసాద్ వాళ్ళ అమ్మ సుశీల, అతని పిల్లలు చైత్రికా, చైత్రిక్ లు మరియు ఇంకో చెల్లెలు స్వప్న లు పాల్వంచ లో ఉంటే, ఇక్కడ ఉంటే పోలీసు వారు వచ్చి పాత కేసు విషయంలో తీసుకుపోయే అవకాశం ఉంటది అని చెప్పి, అంతేగాక ప్రసాద్ మరియు మిగతావారు నిజామాబాదు లో ఉన్నారని సుశీలతో చెప్పి, అందరిని కూడా కారులో నిజామాబాద్ తీసుకెళ్లి, అక్కడ రైల్వే స్టేషన్ సమీపములో ఉన్న అన్నపూర్ణ లాడ్జిలో ఉంచినాడు. అంతకుముందే ప్రశాంత్ తన తల్లి అయిన వడ్దమ్మకి జరిగిన విషయం చెప్పి, తనకు సహకరించాల్సిందిగా కోరితే, అందుకు ఆమె కూడా సరే అని ఒప్పుకుని, నిజామాబాదు లో ఉన్న అన్నపూర్ణ లాడ్జ్ కి వచ్చింది.  
తేదీ 4-12-2023 నాడు ప్రసాదు పిల్లల్ని చూడాలని అంటున్నాడని చెప్పి, సుశీలను, స్వప్నను లాడ్జిలోనే ఉంచి, వారికి కాపలగా వడ్దమ్మ ని అక్కడే ఉంచి, ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రశాంతు, అతని తమ్ముడు (మైనర్) ఇద్దరు కలిసి కారులో నిజామాబాద్ నుండి సోన్ బ్రిడ్జి వైపు పిల్లలను తీసుకువెళ్లి, మార్గమధ్యలో ఇద్దరు పిల్లల  గొంతు నులిమి చంపివేసి, సోన్ బ్రిడ్జి దగ్గర కారు ఆపి, పక్కనే రెండు గోనెసంచులను తీసుకొని, వాటిల్లో శవాలను కట్టిపెట్టి, బ్రిడ్జి పై నుండి ఇద్దరు పిల్లల శవాలను నీళ్లలో పడవేసి అక్కడి నుండి వెళ్ళిపోయినారు.ఆ తర్వాత లాడ్జిలో ఉన్న సుశీలతో, ప్రసాద్, అతని భార్య పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారని, వాళ్ళ దగ్గరికి మనం తర్వాత వెళ్దామని చెప్పి సుశీలను, ఆమె కూతురు స్వప్నను లాడ్జిలోనే  ఉంచి, వారితో వడ్దమ్మ ని అనుమానం రాకుండా ఉంచాడు.
తేదీ 13-12-2023 నాడు ప్రశాంత్, వంశీ, మైనర్ బాలుడు లు కలిసి లాడ్జ్ లో ఉన్న స్వప్నను తీసుకొని, అదే కారులో ఎక్కించుకొని అక్కడినుండి కామారెడ్డి వైపు వస్తూ, గాంధారి ఎక్స్ రోడ్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని, గాంధారి వైపు వెళ్తూ, భూంపల్లి గ్రామ శివారులో వచ్చేసరికి, స్వప్న గొంతుకు తాడు వేసి బిగించి, ఆమెని చంపివేసి రోడ్డు పక్కన గుంతదగ్గర పడవేసి, పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. లాడ్జ్ లో ఉన్న సుశీలకు మాయమాటలు చెప్పి ఆమెని లాడ్జ్ లో నుండి ఎక్కడికి పోకుండా, మిగతా వారాంతా కూడా క్షేమముగా ఉన్నట్లుగా చెప్పి, ఆమెని కూడా చంపితే ఆ కుటుంభములో ఇంకా ఎవరు కూడా ఉండరని, ఆ తర్వాత ఆస్తి గురించి గాని, డబ్బుల గురించి గాని అడిగే వారుండరని అనుకున్నాడు.  పోలీసుల అదుపులోకి......  కాగా సుశీల వారి వద్ద నుండి తప్పించుకుని బయటకి పోగా, ఈ రోజు ఉదయం ప్రశాంత్, వంశీ, విష్ణు, మైనర్ బాలుడు, వడ్డమ్మ లు కారులో పాల్వంచలో సుశీల ఉండవచ్చనే కారణముతో, పాల్వంచకి వస్తుండగా, గాంధారి x రోడ్డు లో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగినది. వీరందరినీ అరెస్ట్ చేసి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్. 249/2023 U/s 302, 364, 201, 379 R/W 109 IPC లో జ్యూడీషియల్ రిమాండ్ కి తరలించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. నేరస్థులను కస్టడీ లోకి తీసుకున్న సమయములో రికవరీ అయిన ప్రాపర్టీలో ఒక కారు, ఒక బైక్  ల్యాండ్ రిజిస్టర్ డాక్యుమెంట్స్, రూ. 30,000/- నగదు, సెల్ ఫోన్ లు -5, త్రాడు,పెట్రోల్ బాటిల్ లు-2 ఒక బంగారు పుస్తె,ఒక పార & గడ్డపార  ,ఒక Rold Gold నల్లపూసల దండ ఉందని తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రామన్, ఎస్సై రాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుళ్లు జానకిరామ్, రవికుమార్,  అబ్దుల్ హమీద్, శశికాంత్,  నరేష్, సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అరుణ్,రవి, రాజేందర్ లను ఎస్పీ ప్రశంసించారు.