అభివృద్ధి చెందిన దేశంగా  భారత్‌ అవతరించేందుకు టెక్నాలజీ  సాయం

అభివృద్ధి చెందిన దేశంగా  భారత్‌ అవతరించేందుకు టెక్నాలజీ  సాయం

ఢిల్లీ: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా  భారత్‌ అవతరించేందుకు సాంకేతికత సాయపడనుందని ప్రధాని మోదీ  అన్నారు. డిజిటల్‌ విప్లవం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ అనంతరం 'సాంకేతికతతో జీవనం' అనే అంశంపై నిర్వహించిన ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. చిన్న వ్యాపారులకు భారంగా ఉన్న నిబంధనలను తగ్గించాలని తాము కోరుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈ తరహావి 40 వేల నిబంధనలను తొలగించామన్నారు. తమకు అడ్డుగా భావిస్తున్న నిబంధనలతో జాబితాను రూపొందించాలని చిన్న వ్యాపారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యను అధిగమించేందుకు ఫేస్‌లెస్‌ టెక్నాలజీని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత పౌరుల జీవితాల్లో సమూల మార్పులకు సాంకేతికత ఉపయోగపడుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో 5జీ, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు మార్పులు తీసుకొస్తున్నాయని మోదీ అన్నారు. టెక్నాలజీ వల్లే 'వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌' కార్యక్రమం సాకరమైందని చెప్పారు. జన్‌ధన్‌ యోజన, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌తో పేద ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. ఈ శతాబ్దం టెక్నాలజీతో ముడిపడి ఉందని, దీన్నెవరూ ఆపలేరని మోదీ అన్నారు.