ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలి

ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలి
  • ట్రోలింగ్ ముఠాలకు గుణపాఠం చెప్పాలి
  • తులసీచందుకు జర్నలిస్టులు, ప్రజా సంఘాల మద్దతు
  • టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంఘీభావ సమావేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో:ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని సుప్రసిద్ధ పాత్రికేయులు, మేధావులు, ప్రజా సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు. కిరాయిరాతలతో జర్నలిజాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తున్న ట్రోల్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే, హెచ్ యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్ వర్క్ ఆఫ్ ఒమెన్ ఇన్ మీడియా, తెలంగాణ స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్, మేగజైన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్నలిజం–- ట్రోల్ ముఠాలు’ అనే అంశంపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు డాక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ వ్యవస్థీకృత స్థాయిలో ట్రోలింగ్ ముఠాలు తయారయ్యాయని అన్నారు. నిజం చెప్పేవారిని భయపెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా పాపులారిటీ బాగా పెరిగిందన్నారు. కర్ణాటక ఎన్నికలలో సోషల్ మీడియా బాగా పనిచేసిందన్నారు. సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఇండిపెండెంట్ జర్నలిజం విస్త్రతంగా ప్రాచుర్యం పొందిందని ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు- దేవులపల్లి అమర్ అన్నారు. గతంలో పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాస్తే బాధితులు సంపాదకులకు ఫిర్యాదు చేసేవారని, ఇప్పుడు ఏ సంపాదకుడి కట్టడి లేకుండా ఇండిపెండెంట్ జర్నలిజం సాగుతోందన్నారు. మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న వేళ నైతిక విలువలు నాశనం అయిపోయాయని -ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సమాజ మార్పు కోసం పోరాటం చేస్తున్న మహిళలపై దాడులు జరగడం అన్యాయమని అన్నారు. మహిళలకు మెరుగైన జీవితం, విలువల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలను ఎవరు జీర్ణించుకోలేరో వారే మీడియాపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. 

పెద్ద శక్తులే పనిచేస్తున్నాయి 

ట్రోలింగ్ ముఠాల వెనుక పెద్ద శక్తులే పనిచేస్తున్నాయని మరో సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ అన్నారు. భౌతికంగా మనుషులపై దాడులకు, ట్రోలింగ్ ముఠాలకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. ఇండిపెండెంట్ జర్నలిజంను ప్రజా జర్నలిజంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వాలు నియంతృత్వంతో భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నాయన్నారు. ఇండిపెండెంట్ వాయిస్ ను కాపాడాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిలుపునిచ్చారు. ప్రజల వాయిస్ సోషల్ మీడియా వేదికగా ఇండిపెండెంట్ జర్నలిజం ద్వారా వినిపిస్తోందని అన్నారు. జర్నలిజంలో క్రిటిక్ థాట్ అనేది లేకుండా చంపివేయడానికి ట్రోలింగ్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. చెప్పినమాట విననివారిపై ప్రభుత్వాలు అసహనంతో సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఓయూ జర్నలిజం శాఖ మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మజా షా ఆరోపించారు. ప్రతిభావంతులైన జర్నలిస్టులు యూట్యూబ్ వేదికగా పని చేస్తున్నారని అన్నారు. ప్రజాధనంతో లేనివి ఉన్నట్లుగా ప్రభుత్వాలు ప్రోపగండ చేస్తున్నాయన్నారు. డబ్బులు తీసుకుని అవాస్తవ వార్తలను ప్రచురిస్తున్నారనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మనిషి అభిప్రాయాలను ఎందుకు సహించలేకపోతున్నారని సీనియర్ జర్నలిస్టు సజయ ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ వారసులుగా, జర్నలిస్టులుగా నిలబడతామని అన్నారు. ఇండిపెండెంట్ మీడియాను కాపాడాలని సీనియర్ సంపాదకులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. తులసీ చందు శక్తివంతమైన జర్నలిస్టు కాబట్టే ఆమెపై దాడి జరిగిందన్నారు.

‘యాంటీ హిందూ’ నింద మోపారు

 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ‘మతం వస్తోంది మేలుకో’ అనే వీడియో చేసినందుకు తనపై యాంటీ హిందూ అనే ముద్ర వేశారని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తాను పెట్టిన నాన్ కంటెంట్ సబ్జెక్టు మీద ఫేస్ బుక్ లో ఎటాక్ జరిగిందన్నారు. తాను ఏ వార్తను సృష్టించలేదని, అయినప్పటికీ తనను శత్రువుగా, అర్బన్ నక్సలైట్ గా, కమ్యూనిస్టు అని వ్యంగంగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులపై దాడులు చేసేవారి వెనుకఉన్న వారెవరో ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై దాడులకు పాల్పడిన నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టానని చెప్పారు. ట్రోలింగ్ ముఠాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను, ప్రధానమంత్రిని ప్రశ్నించేవారిపై నేరుగా దాడులు చేయాలని పెద్ద వ్యవస్థను పెట్టుకున్నారని ఆరోపించారు. 

తులసికి అండగా ఉంటాం

సభకు అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ కిరాయిరాతలతో మీడియాను భయపెట్టే ముఠాలకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని అన్నారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్లు వార్తలను రాస్తే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు మీద సోషల్  మీడియాలో జరుగుతున్న దాడిని మీడియా మొత్తం మీద జరిగనట్లుగా భావించి ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మహిళా సంఘం నేత సంధ్య సీనియర్ జర్నలిస్టులు పద్మ వంగ, లక్ష్మణరావు, కృష్ణమూర్తి, బాలరెడ్డి, ప్రసాద మూర్తి, కార్టునిస్టు నరసింహం, డాక్టర్ మిత్ర, హిప్నో పద్మ కమమలాకర్, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బాధ్యుడు బాన్సువాడ నాని,  తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నేత కరుణాకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నేత అంబటి నాగయ్య, తెలంగాణ టీచర్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ నేత వై. అశోక్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ నేత శంకర్, తెలంగాణ రచయితల వేదిక ఇనిశెట్టి శంకర్, మహిళా ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యులు దేవి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకలపై జరుగుతున్న దాడులు, అందుకు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. 39 పౌర, ప్రజా సంఘాలతో కూడిన ఐక్య వేదికగా సోషల్ ప్లాట్ ఫాంగా ఏర్పడాలని నిర్ణయించారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందుకు సమావేశం ఏకగ్రీవంగా సంఘీభావం ప్రకటించింది.  

అంబటి అంజనేయులకు ఘన నివాళి

నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన  ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి అంజనేయులకు సమావేశం ఘనంగా నివాళులర్పించింది. సభికులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.