‘సీఎం’కి విజయ శాంతి కొత్త నిర్వచనం

‘సీఎం’కి  విజయ శాంతి కొత్త నిర్వచనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారమన్నారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి పేపర్ లీక్ చేయొచ్చా అని ప్రశ్నించారు.  హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ‘మా నౌకరీలు మాగ్గావాలి’ పేరుతో శనివారం  బీజేపీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది.

ఈ నిరసన కార్యక్రమంలో విజయశాంతి మాట్లాడారు. పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులని, దాంట్లో మళ్లీ బేరాలు ఆడుతారని.. ఆయనకు కావాల్సింది లాభాలు మాత్రమేనని మండిపడ్డారు.  నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజులు మాఫీ చేస్తామని, ఉచితంగా భోజనాలు పెడతామని, పుస్తకాలు పంపిణీ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని .. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.