చేసిందే అన్యాయం ఉత్సవాలు ఎందుకు

చేసిందే అన్యాయం ఉత్సవాలు ఎందుకు

 నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరుగలేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి దశాబ్ది ఉత్సవాల పేరుతో కెసిఆర్ భ్రమలు కలిగిస్తున్నాడని అన్నారు. రైతు లకు రుణమాఫీ చేయకుండా అకాల వర్షాల తో తీవ్రంగా నష్ట పోయిన రైతును ఆదుకోకుండా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు క్వింటాలుకు అయిదు కిలోలు కోతలు విధించి రైతు ఉత్సవాలు జరిపే అర్హత బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు అన్నారు. కానిస్టేబుల్ నుండి ఎస్సై వరకు టీఏ,డిఏ,పిఆర్సి ఒక్కొక్కరికి రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించకుండా సీనియర్,జూనియర్ అని స్థానికత లేకుండా చేసి ఆఖరికి బందోబస్తుకు వెళ్ళే పోలీసులకు ఫీడింగ్ అలవెన్సులు కూడా చెల్లించని బిఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసు ఉత్సవాలు జరిపే అర్హత ఉందా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నరేందర్ రెడ్డి అన్నారు.

ఏసిడి పేరు మీద ఒక్కొక్క సర్వీసు పై వేల రూపాయలు చార్జీలు వేస్తే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రద్దు చేపించిందని, మళ్లీ ఏఎస్డి పేరు మీద నోటీసులు ఇస్తున్నారని నోటీసులు తీసుకెళ్లే ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ప్రజల నిలదీస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడికక్కడ చెరువులు కుంటలు బిఆర్ఎస్ నాయకుల వల్ల కబ్జాలకు గురయ్యాయని మిషన్ కాకతీయ కాస్త కమీషన్ కాకతీయగా మారిందని ఎం ముఖం పెట్టుకొని చెరువుల పండుగ జరుపుతున్నారని నరేందర్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రిజర్వాయర్ లు ఎప్పుడు నిండుకుండలా ఉంటాయని ప్రగల్భాలు పలికిన బిఆర్ఎస్ నాయకులు మానేర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ కు దగ్గర్లో ఉన్నదానికి ఎంసమాధానం చెప్తారని ప్రశ్నించారు.ఈ సమావేశంలో సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్,గుండాటీ శ్రీనివాస్ రెడ్డి,లింగం పల్లి బాబు,కుర్ర పోచయ్య, ఎండి చాంద్,షబానా మహమ్మద్, షేక్ షేహెన్ష, పొరండ్ల రమేష్, ముల్కల కవిత, అన్నే జ్యోతి, నెన్నెల పద్మ, తమ్మడి ఎజ్రా, కీర్తి కుమార్, మామిడి సత్యనారాయణ రెడ్డి, అశ్రఫ్ ఖురేషి, నదిమ్, జిలకర రమేష్, మహమ్మద్ భారీ,సిరాజొద్ధీన్,కమల్, తది తరులు పాల్గొన్నారు.