ఇష్టం లేని కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య...

ఇష్టం లేని కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య...

ముద్ర,తెలంగాణ:-ఈసం కాంతారావు మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఐదో తరగతి చదువుతున్న చిన్నకొడుకు హర్షవర్ధన్ (09) సీతానగర్ లో హాస్టల్ ఉంటున్నాడు. ఎండాకాలం సెలవుల కోసం ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న కాంతారావు తన ఇద్దరు పిల్లలకు కటింగ్ చేయించాడు. అయితే, హర్షవర్ధన్ కు ఆ కటింగ్ నచ్చలేదు. కటింగ్ అలా చేయించినందుకు బార్బర్ షాపు వద్దే గొడవ చేశాడు. ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో కాంతారావు అలానే బావుంటుంది అంటూ సర్ది చెప్పాడు. అయినా హర్షవర్ధన్ ఊరుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. 

పిల్లాడు బాధలో ఉన్నాడు. కొద్దిసేపటికి వాడే సర్దుకుంటాడు అని అనుకున్నారు హర్షవర్ధన్ తల్లిదండ్రులు . ఈ క్రమంలో ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తరువాత వాంతులు చేసుకుంటున్న హర్షవర్ధన్ కనిపించాడు. దీంతో కంగారు పడిన కాంతారావు ఏమైందంటూ కొడుకును అడిగితే.. కటింగ్ నచ్చక పురుగు మందు తాగాను అంటూ హర్షవర్ధన్ బదులిచ్చాడు. దీంతో హతాశులైన కాంతారావు దంపతులు.. హర్షవర్ధన్ ను నర్సంపేట లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్ కు వెంటనే చికిత్స చేసినా కోలుకోకపోవడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ గురువారం ఉదయం మరణించాడు. దేంతో కాంతారావు దంపతులకు పుత్రశోకమే మిగిలింది. కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు.