ఇళ్ళల్లో అకస్మాత్తుగా చెలరేగుతున్న నిప్పు

ఇళ్ళల్లో అకస్మాత్తుగా చెలరేగుతున్న నిప్పు

భయాందోళనలో గ్రామస్తులు
మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో ఘటన

ముద్ర న్యూస్,కాటారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మందపెల్లి పోచయ్య ఇంట్లో నాలుగు రోజులుగా అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. గత శనివారం నుంచి మంగళవారం వరకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలుఎగిసిపడుతున్నాయి.దీంతో ఇంట్లో వస్తువులు కాలిపోతున్నాయని బాధిత కుటుంబం తెలిపింది. మంటల అకస్మాత్తుగా వస్తుండటంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.మంటలు చెలరేగడానికి భూగర్భ గ్యాస్ లీకేజా..లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. తాడిచెర్ల గ్రామ శివారులో జెన్కో పవర్ ప్రాజెక్టు కోసం ఏఎంఆర్ కంపెనీ చేపట్టిన ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ ఏదైనా గ్యాస్ లీక్ అవుతూ సమీపంలోని డేంజర్ జోన్ లో గల ఇళ్ళల్లో మంటలు చేలవేగుతున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయనే వార్త దావనంలా వ్యాపించడంతో తాడిచెర్ల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మంటలకు గల కారణాలు తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు