నేడు భారత మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌ పాయ్‌ జయంతి

నేడు భారత మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌ పాయ్‌  జయంతి
atal bihari vajpayee

అటల్‌ బిహారీ వాజపేయి డిసెంబర్‌ 25 1924న మధ్య ప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో  జన్మించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఫ్‌ు పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.

1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్‌ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్‌ 24, 2014 లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్‌ 25 ను సుపరిపాలనా దినం గా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల విూదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ మార్చి 27 2015 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.ఈయన ఆగస్టు 16, 2018 న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు.