వార్తలు రాస్తే కేసులు పెడతారా

 వార్తలు రాస్తే కేసులు పెడతారా
  • జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
  • టియుడబ్ల్యూజే (ఐజేయు)  రాష్ట్ర అధ్యక్షుడు నగునూరు శేఖర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కలాలకు సంకెళ్లు వేస్తూ ప్రజాస్వామ్యం కల్పించిన పత్రిక స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అన్నారు. గత వారం రోజులుగా కరీంనగర్ లో జర్నలిస్టులపై జరుగుతున్న పర్యావసనాలపై టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగునూరి శేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాను అనగదొక్కాలనుకోవడం పరిపక్వత లేని విధానానికి మచ్చుతునక అన్నారు.ప్రస్తుత ఎన్నికల సమయంలో కరీంనగర్ జర్నలిస్టులు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని దుస్థితి దాపురించిందన్నారు.

అయితే వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పోరాటాలే ఊపిరిగా ఆరు దశాబ్దాల కాలం ఈ సంఘం ముందుకు సాగుతున్న విషయాన్ని జర్నలిస్టులపై కేసులు నమోదు చేసేవారు, చేయించేవారు గుర్తుంచుకోవాలన్నారు. ఇవేమీ తమకు కొత్త కాదన్నారు. వారం రోజుల వ్యవధిలో కరీంనగర్ పట్టణంలో ముగ్గురు జర్నలిస్టులపై పెట్టిన కేసుల పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసుల విషయంలో పోలీసులు  పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జానంపేట మారుతి స్వామి, ఉపాధ్యక్షుడు ఒంటెల కృష్ణ, యూనియన్ నేతలు ఎంఏ ఆసద్, రమేష్, కొండల్ రెడ్డి, సందీప్ కుమార్, టి యు డబ్ల్యూ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, 16 మండలాలకు చెందిన 100 మంది సభ్యులు పాల్గొన్నారు.