కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షకు తరలిరండి

కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షకు తరలిరండి

ముద్ర ప్రతినిధి, జనగామ: ఈనెల 14న మంచిర్యాల జిల్లాలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సత్యాగ్రహ దీక్షకు జిల్లా నలుమూల నుంచి తరలి రావాలని కాంగ్రెస్‌ లీడర్లు పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరు సమావేశంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీరాం, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్లు ప్రవీణ్, జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేత రాహుల్‌ గాంధీకి వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేకనే మోడీ కుట్ర పూరితంగా ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని తొలగించారని ఆరోపించారు.

యూపీలోని ఓ బీజేపీ ఎంపీ తాను హత్య చేసినట్టు ఒప్పుకున్నా చర్యలు తీసుకోని కేంద్రం.. రాహుల్‌పై కావాలని రెండేళ్ల కింద ఫైల్ అయిన కేసును తీసి జడ్జిమెంట్‌ ఇప్పించారని ఆరోపించారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జిపై కూడా గతంలో పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, అరాచక పాలనను అంతం చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని అందులో భాగంగా సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ దీక్షకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.