నిబంధనల మేరకు పకడ్బందిగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ 

నిబంధనల మేరకు పకడ్బందిగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ 

జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భారత ఎన్నికల కమీషన్ సూచించిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.  మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ డిసిపి వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ  భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 13 వరకు నామినేషన్ల స్క్రూటినీ, నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు.  పెద్దపెల్లి జిల్లాలో 2వ ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం 6 లక్షల 94 వేల 612 మంది ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు అక్టోబర్ 30 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు,  నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. 

రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో 10 సర్వేలెన్స్ బృందాలను, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, 5 వీడియో సర్వేలెన్సు బృందాలను,  ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు.  ఎన్నికల నియమాలు ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. 

డిసిపి వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ, 
అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.