అనుమతిలేకుండా మూగజీవాలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

అనుమతిలేకుండా మూగజీవాలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు
  • జిల్లా సరిహద్దు గుండా  పశువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు
  • అక్రమంగా పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉన్నచో పోలీసులకు తెలపాలి.
  • జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి

ముద్ర. వనపర్తి:- ఎవరైనా అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దృష్టికి వస్తే సంబంధిత పోలీసులకు, 100, లేదా కంట్రోల్ రూమ్  63039 23200 కు సమాచారం అందించాలే తప్ప, స్వయంగా వెళ్లి అక్రమంగా అడ్డుకోనీ గొడవలు సృష్టించినట్లయితే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి  ఒక ప్రకటనలో తెలిపారు.  బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువులను రవాణా చేసే అవకాశం ఉన్నందున, పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో జిల్లా లో మూడు చెక్ పోస్ట్ ల ను నిర్వహించి ఎలాంటి  అక్రమ తరలింపునకు పాల్పడకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగను శాంతి పూర్వకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి ప్రణాళికలతో కార్యచరణ సిద్దం చేస్తున్నట్లు వివరించారు.

 జిల్లా లో గోపాల్పేట మండలంలోని బుద్ధారం గండి దగ్గర, పెద్దమందడి మండలం నేషనల్ హైవే మోజర్ల దగ్గర, పెబ్బేరు బైపాస్ దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.  జిల్లాలోని ప్రధాన పశువుల సంతలో పశువుల రవాణాకు కావాల్సిన అనుమతి పత్రాలు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని వాటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వధశాలకు అనుమతి లేని పశువులను, దూడలు,గోవులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పశువుల వ్యాపారులు ఈ సున్నితమైన అంశాన్ని గమనించాలన్నారు. పశువులను ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట ఉండాలన్నారు, పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను తీసుకొని వస్తున్నట్లయితే వాటిని అమ్మినా వారి వివరాలు, సంబంధిత పశువైద్యాధికారి ధ్రువీకరించిన ఆరోగ్య, రవాణాకు అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.రవాణా చేస్తున్న సమయంలో పశువులకు ఎలాంటి హాని తలపెట్టిన, హింసించిన చట్టప్రకారం తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు ఉంటుందన్నారు. బక్రీద్ పండుగ సందర్బంగా  ప్రజలు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు, పండగలు పూర్తయ్యేవరకు అదనంగా పెట్రోలింగ్ వాహనాలతో జిల్లా అంతటా నిఘా పెట్టినట్లు తెలిపారు, జిల్లా ప్రజలకు సంపూర్ణ శాంతి పూర్వకమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. శాంతిభద్రతల సమస్యలులేని జిల్లాగా గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో జిల్లా అభివృద్ధికి తోడ్పడాలన్నారు.