స్థానికేతరులు లోకల్​గా ఉండొద్దు

స్థానికేతరులు లోకల్​గా ఉండొద్దు
  • నియోకవర్గాలను వదిలి వెళ్లాలి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు
  • రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

ముద్ర , తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల  ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 13 నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. ఇక సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు.  స్థానికేతరులు లోకల్​గా ఉండొద్దని, నియోకవర్గాలను వదిలి వెళ్లిపోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

పోలింగ్ కు సర్వం సిద్ధం..

పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైందని వికాస్​రాజ్​ అన్నారు. 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో లక్ష మంది పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర పోలీసులు 65వేల మంది, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారన్నారు.  375 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిలిపేయాలని చెప్పారు. రేపు ఎన్నికల సిబ్బంది సామగ్రి పంపిణి చేస్తామని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఉంటుందన్నారు. నవంబర్​30న అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని  వికాస్‌ రాజ్‌  సూచించారు.