దేశంలో కరోనాపై హైఅలర్ట్ 

దేశంలో కరోనాపై హైఅలర్ట్ 

దేశంలో కరోనా కేసులు మళ్లీ బుసులు కొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన మొదలైంది. అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులతో కేంద్రం మరోసారి అలర్ట్ అయ్యింది. దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 27వ తేదీన అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. రాష్ట్రాల్లో కరోనా కేసుల తగ్గుదలకు,  వైరస్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కొత్తగా 1580 కరోనా కేసులు నమోదవగా... ఆరుగురు మృతి చెందారు. 

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల మొదలైందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేసులతో పాటు ఈ ఒక్క రోజే కరోనా వల్ల ఆరుగురు చనిపోయారని స్పష్టం చేసింది. వారిలో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కు చెందిన వారు ఒక్కొకక్కరు చొప్పున ఉన్నారని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 910 మంది కోలుకోవడంతో ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు, వీక్లీ పాజిటివిటీ రేటు వరుసగా 1.33 శాతం,1.23 శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది.