ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే ఉన్నత ఫలితాలు
![ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే ఉన్నత ఫలితాలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646648c1db2aa.jpg)
కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
ముద్ర ప్రతినిధి, వనపర్తి:ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గత సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీియట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంపై విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి గల కారణాలను విద్యాశాఖ అధికరులను ప్రశ్నించారు.
విద్యా శాఖ అధికారులు తక్కువ ఫలితాలు రావడానికి గల కారణాలు సమీక్షలో తెలియజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరు కాకపోవడం అదేవిధంగా తల్లిదండ్రులు వలసలు వెళ్లడం ప్రధాన కారణాలని వివరించారు. కొంతమంది పాఠశాలలకు గైర్హాజర్ అయి పనులలో వెళ్లడం సైతం ఒక కారణమని తెలియజేశారు. సబ్జెక్టు వారీగా టీచర్ల కొరత ఉండడం, విద్యార్థులు సెల్ ఫోన్లు వాడటం, పండగ సమయాల్లో తమ ఏకాగ్రతను కోల్పోవడం వల్ల సరైన ఉతీర్ణత సాధించలేదని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విద్యార్థులు పనులకు వెళ్లకుండా క్రమంగా పాఠశాలకు వచ్చే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఇకముందు ఉపాధ్యాయులు మారిన కాలానుగుణంగా బ్రిడ్జ్ కోర్సులు, డిజిటల్ విద్యను సైతం అందించేటట్లు సిద్ధం కావాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడలు, అన్ని రంగాల్లో మెలకువలు నేర్పించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మండల ఎడ్యుకేషన్ అధికారులు సెక్టరియల్ అధికారులు పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో డి. ఈ. ఒ గోవిందరాజులు, ఆర్.సి. ఒ వనజ, డి.ఎస్.సి.డి. ఒ నుషిత, వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, డి.టి.డి. ఒ శ్రీనివాస్, ఎమ్. ఈ. ఒ లు తదితరులు పాల్గొన్నారు.