నిరాశలో ఐటీ దిగ్గజం మహీంద్రా

నిరాశలో ఐటీ దిగ్గజం మహీంద్రా
  • లాభాల్లో 38 శాతం తగ్గుదల
  • కంపెనీని వీడిన 4103మంది ఉద్యోగులు 

ముంబై: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థను కష్టాలు చుట్టుముడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తొలి త్రైమాసిక ఫలితాల్లో 38 శాతం తగ్గదల (లాభాలు) నమోదు కాగా, ఇదే సమయంలో 4103 మంది సీనియర్​ ఉద్యోగులు కంపెనీకి స్వస్థి పలికారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టెక్​మహీంద్రాకు ఈ పరిస్థితులు తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. ఓ వైపు లాభాల తగ్గుదలతో సతమతం అవుతుంటే మరోవైపు నిపుణులైన ఐటీ సిబ్బంది కంపెనీని వీడి వెళుతుండడంతో ఏం చేయాలనే ఆలోచనలో సంస్థ ఉంది. ఇక ఈ ఫలితాల తర్వాత టెక్ మహీంద్రా ఎండీ అండ్ సీఈఓ సీపీ గుర్నానీ బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గత అయిదేళ్లలోనే తాను చూసిన అత్యంత కఠిన త్రైమాసికంగా దీనిని అభివర్ణించారు. తమ ప్రధాన విభాగమైన కమ్యూనికేషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ (సీఎంఈ), మీడియా వ్యాపారాల్లో ప్రతికూలతల నేపథ్యంలోనే.. మొత్తం గణాంకాలపై ప్రభావం పడిందని చెప్పారు. భవిష్యత్తులో వీటిని అధిగమించి మళ్లీ లాభాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-– జూన్ త్రైమాసిక ఫలితాలను ఐటీ దిగ్గజ సంస్థలు వరుసగా విడుదల చేస్తున్నాయి. ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒక్కటే అంచనాలను అందుకుంది. మంచి లాభాలు నమోదు చేసింది. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. జీతాలు పెంచింది. వేరియబుల్ పే , ప్రమోషన్లపైనా కీలక ప్రకటనలు చేసింది. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు అంచనాలను అందుకోలేదు. వేతనాల పెంపు ప్రక్రియను కూడా వాయిదా వేశాయి. ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గింది. ఇదే బాటలో ఇప్పుడు మరో దేశీయ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. 

తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 692.5 కోట్లుగా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ లాభం ఏకంగా రూ. 1131.6 కోట్లు కాగా ఇది 38 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆదాయం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. నిర్వహణ లాభాలు తగ్గాయి. కొత్త కాంట్రాక్టుల లభ్యత తగ్గింది. సిబ్బంది వలసల్లో మాత్రం 23 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది.ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం. ఈ త్రైమాసికంలో ఏకంగా 6 శాతం అంటే దాదాపు 4103 మంది ఉద్యోగులు కంపెనీని వీడారు. కిందటి త్రైమాసికంలో ఈ సంఖ్య 4688 గా ఉంది. అయినా ఒక్కసారే వేల మంది ఉద్యోగులు బయటికి వెళ్లడం కలవరపరుస్తోంది. అయితే ఇందులోనే కాదు ఇన్ఫోసిస్‌లో 6940 మంది, విప్రోలో 8812 మంది ఉద్యోగులు తగ్గగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 2506 మంది తగ్గారు. టీసీఎస్​మాత్రమే 523 మందిని కొత్తగా చేర్చుకుంది. అంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పొచ్చు. కొత్తగా నియామకాలు కూడా చేపట్టడం లేదని కూడా అర్థమవుతోంది. ఇది ఫ్రెషర్లను ఇబ్బందికి గురిచేసే అంశంగా చెప్పొచ్చు.