కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పోలీసుల వాహనాల తనిఖీలు

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పోలీసుల వాహనాల తనిఖీలు

డ్రంకెన్ డ్రైవ్లో 56 మంది పట్టివేత, 81 వాహనాలు సీజ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్:కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారినిపట్టుకోవడంతోపాటు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కు పాల్పడిన, శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలు, నెంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్న వాహనాలు, మైనర్లు నడుపుతున్న వాహనాలను పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారిని పట్టుకుని పట్టుబడిన వారిని వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించండం జరిగింది. ఈ సందర్భంగా అనుమానిత వాహనాలను సైతం తనిఖీ చేశారు. ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.

కమీషనరేట్ వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 56 మందిని పట్టుకున్నారు. శబ్దకాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలు 8, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ నకు పాల్పడిన వాహనాలు 14, నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్ల పై సంచరిస్తున్న వాహనాలు 53, మైనర్లు నడుపుతున్న వాహనాలు 5 పట్టుకున్నారు. పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులు, వాహనాల ఇచ్చిన యజమానుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఫోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ సహాయంతో అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. కమీషనరేట్ వ్యాప్తంగా నిరంతరం డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ప్రజల రక్షణ, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని అన్నివర్గాలకు చెందిన ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధలను పాటించాలని తెలిపారు.