ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన
![ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d4c8da3e906.jpg)
ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. జాతీయ రాజకీయాలను మరింతగా ఆకర్షించడమే ఈ సభ లక్ష్యం. ఇటీవల ఖమ్మంలో బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో రాష్ట్రం వెలుపల ఇదే తరహాలో మరో సభ నిర్వహిస్తే.. పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు.
నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిశారు.ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ లో జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ముందుగా ఈ నెల 29న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలో.. మహారాష్ట్ర ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేసీఆర్ కాసవెనక్కి తగ్గారు. కాగా.. మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. మండలికి సంబంధించి.. రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆతరువాత ఫిబ్రవరి 2న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
అయితే ఇవేవీ సభకు అడ్డు రాకూడదన్న కారణంతోనే బిఆర్ఎస్ సభకు ఫిబ్రవరి 5ను ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.వచ్చే నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, హన్మంత్ షిండే పరిశీలించారు. ముందుగా గురుద్వారా సందర్శన ఉంటుందని, ప్రత్యేక పూజల అనంతరం హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కంద్ బోర్డు మైదాన్లో బీఆర్ఎస్ చేరికల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం నాందేడ్ సిటీ ప్రైడ్ హోటల్లో విూడియాతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. అయితే నాందేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటన, సభ నిర్వహణకు సంబంధించి అన్ని అనుమతులు లభించడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఛత్రపతి సాహు మహరాజ్ మనవడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు చేయాలని కోరారు ఆయన. ఈనేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటనకు సన్నాహాలు మొదలయ్యాయి