ముందు నుయ్యి వెనుక గొయ్యి

ముందు నుయ్యి వెనుక గొయ్యి

కాపుల రిజర్వేషన్‌ వ్యవహారం
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని పదే పదేచెప్పుకుంటే బీసీల ఓట్లు గల్లంతయ్యే అకాశం ఉండటంతో టీడీపీ నేతలు సైలెంట్‌ అవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చింది. అయితే అవి అమలు జరిపే విషయంలో సాంకేతికంగా వచ్చిన అడ్డంకులతో అమలు సాధ్యం కాలేదు. ఇదే సమయంలో ఎన్నికలు రావటంతో కాపు రిజర్వేషన్ల వ్యవహరం తెరమరుగు అయ్యింది. అయితే ఇటీవల పార్లమెంట్‌ సాక్షిగా కాపు రిజర్వేషన్లు కరెక్టే అని ప్రకటన రావడంతో ఈ విషయంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు మాట్లాడలేకపోతున్నారు. ఆ క్రెడిట్‌ ను స్కోర్‌ చేసుకునేందుకు ప్రయత్నించాలన్నా కూడా వెనుకా ముందు ఆలోచించి వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఎలాంటి కామెంట్స్‌ చేసినా.. బీసీ వర్గాలతో దానిపై కామెంట్లు చెప్పించాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుందని భావించిన టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహరం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఈ వ్యవహరంపై రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సైతం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న రిజర్వేషన్లు కావాలంటూ కాపులు ఆందోళనలు చేశారు. అయితే గత ప్రభుత్వాలు వాటిని అంతగా పట్టించుకోలేదు. 

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సైతం కాపులు పెద్ద ఎత్తు చేసిన పోరాటాలు తరువాత, విభజన అంశం తెరవిూదకు రావటం, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం జరిగింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. దీంతో  బీసీ వర్గాలు టీడీపీపై  కినుకు వహించాయి. బీసీ వర్గాలకు చెందాల్సిన ఫలాలను కొట్టేసి, టీడీపీ కాపులకు పంచిందని ఆ వర్గం మండిపడిరది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. అదే వీక్‌ పాయింట్‌ ను పట్టుకున్న వైసీపీ, తన వంతు ప్రచారం చేయటంతో బీసీ వర్గాలు అన్నింటిని తన వైపునకు తిప్పుకోవడంలో వైసీపీ సక్సెస్‌ అయింది. దాని ఫలితంగానే 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది.

బీసీలను కేంద్రంగా చేసుకొని రాజకీయం నడుపుతోంది. ఇందులో భాగంగానే జయహో బీసీ సభను భారీ ఎత్తున నిర్వహించింది వైసీపీ. రాష్ట్ర కేబినెట్‌లో సైతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రాధాన్యాత ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఈ వర్గాలకు తమ ద్వారానే న్యాయం జరుగుతుందని ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ సైతం సూచిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పదవులు పొందిన బీసీ వర్గాలతో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభ సక్సెస్‌ కావటంతో ప్రతి నియోజకర్గంలో బీసీ సభలను నిర్వహించేందుకు వైసీపీ సన్నద్ధం అవుతోంది. అయితే ఇదే సమయంలో టీడీపీ సైతం బీసీలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కాపు వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన విషయంలో టీడీపీ నేతలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, అందుకే మౌనం వహించారని  చర్చ నడుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఇదివరకే మొదలుకాగా, బీసీ వర్గం టీడీపీ వైపునకు రావాలంటే, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.