మోడీ దుర్మార్గ పాలనను అంతం చేయాలి

మోడీ దుర్మార్గ పాలనను అంతం చేయాలి
  • కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌
  • 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

ముద్ర ప్రతినిధి, జనగామ: ప్రధాని నరేంద్ర మోడీ దుర్మార్గ పాలన అంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు ఉద్యమించాలని ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నగారిగారి ప్రీతమ్‌ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికార దుర్వనియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

రాజ్యంగ బద్ధమైన పదవులను అదే రాజ్యాన్ని ఉపయోగిస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోడీ తాను చేస్తున్న మోసాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, మీడియా గొంతు నొక్కుతున్నారన్నారు. రాహుల్‌ గాంధీపై ఉద్దేశపూర్వకంగా అనర్హత వేటు వేశారని ఆరోపించారు. మోడీ దుర్మార్గ పాలన అంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు నడుంబిగించాలన్నారు. 27 నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీరాం, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లొక్కుంట్ల ప్రవీణ్‌ పాల్గొన్నారు.