రామకృష్ణ మిషన్ సేవలు మరువలేనివి: త్రిదండి చిన్నజీయర్ స్వామి
![రామకృష్ణ మిషన్ సేవలు మరువలేనివి: త్రిదండి చిన్నజీయర్ స్వామి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6472295b13d12.jpg)
ముద్ర, ముషీరాబాద్: రామకృష్ణ మిషన్ అందిస్తున్న సేవలు మరువలేనివని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. రామకృష్ణ మిషన్ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో భిన్నత్వంలో ఏకత్వం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనం విశిష్టాద్వైతం గురించి వివరించారు.
రామానుజాచార్యుడు ఆనాడే హరిజనులకు దేవాలయ ప్రవేశం చేయించి అందరినీ సమానంగా చూశారని చిన్నజీయర్ స్వామి చెప్పారు. భారత సనాతన సంప్రదాయాలను, సంస్కృతిని అందరికీ తెలిసేలా చేశారని చెప్పారు. బేలూరు మఠాన్ని సందర్శించాలన్న ఆసక్తిని చిన్నజీయర్ స్వామి వ్యక్తం చేశారు. అనంతరం అద్వైత సిద్ధాంతం కోసం అమెరికా అర్ష విద్య గురుకులం ఉపాధ్యక్షులు స్వామి తత్వవిదానంద సరస్వతి, ద్వైత సిద్ధాంతం గురించి కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య వీరనారాయణ ఎన్.కే.పాండురంగి వివరించారు. రామకృష్ణ వివేకానంద వేదాంత సంప్రదాయాల గురించి బేలూరు రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన స్వామి ఆత్మప్రియానంద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిబ్బంది, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.