తెలంగాణ తల్లికి బంధ విముక్తి కోసమే పాదయాత్ర: విలేఖరుల సమావేశంలో రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లికి బంధ విముక్తి కోసమే పాదయాత్ర: విలేఖరుల సమావేశంలో రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ తల్లికి ప్రస్తుత ప్రభుత్వం నుండి బంధ విముక్తి కోసమే పాదయాత్ర చేపట్టినట్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర లో భాగంగా ఆదివారం ఆయన నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం పరిధి లోని భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో పలికారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తెలంగాణ సాధించినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకున్నదా అని ప్రశ్నించారు. కాగా కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.

కానీ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో మార్పు రాలేదని, తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో నిజామాబాద్ రైతులు హర్యానా రైతులకు తక్కువేం కాదన్నారు.కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాంతంలో  చెరుకు పరిశ్రమను  మూసివేస్తే ఏం చేస్తున్నారని, ఎందుకు ఇక్కడి రైతులను ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన ఆవశ్యకత గురించి చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతం లో సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు వంటి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారని, కానీ ఇప్పుడున్న బీఆరెస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఏ దోపిడీ చూసినా ప్రశాంత్ రెడ్డి, గణేష్, జీవన్ రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయనీ, ఇసుక మాఫియా ద్వారా కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కేవలం కాంగ్రెస్ కే సాధ్యం అవుతుందన్నారు.