హైరిస్క్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలి

హైరిస్క్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలి
  • హైరిస్క్ కలిగిన గర్భిణీలు, బాలింతలకు
  • సమీప ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యేలా చూడాలి
  • ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై దృష్టి సారించాలి
  • గర్భిణీస్త్రీ లకు ఏ చిన్న జ్వర లక్షణాలు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు
  • సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: హైరిస్క్ గల గర్భిణులు,బాలింతలను తప్పనిసరిగా
సమీప ఏరియా, జిల్లా ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యేలా చూసి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారుల ను ఆదేశించారు.
ప్రసూతి మరణాలు పూర్తిగా తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఏ చిన్న సమస్య, జ్వర లక్షణాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్ మెంట్ అందించాలన్నారు.శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారుల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత వైద్యాధికారులతో మెటర్నల్ డెత్ పై సమీక్ష నిర్వహించి, ప్రసూతి సమయంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, గతంలో ప్రభావితం చేసిన అంశాలను అధిగమించడం, తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో ఇది వరకు ప్రసూతి సమయంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయిన గర్భిణీస్త్రీల వివరాలను ఆరా తీసి, వారు చనిపోవడానికి గల కారణాలు ఏమిటి, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వైద్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల తోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ....గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, జ్వరం లక్షణాలు ఉన్నా తల్లికి, బిడ్డకి ప్రమాదం ఉండే అవకాశం ఉందని అన్నారు. వెంటనే క్షేత్ర స్థాయిలో ఉండే ఆశా సిబ్బంది అప్రమత్తమై వారికి ట్రీట్ మెంట్ అందించేందుకు పై అధికారులకు నివేదించాలని సూచించారు. ఏఎన్సీ చెకప్ లతో పాటు హైరిస్క్ కేసులను గుర్తించి వారికి మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని అన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కంటే గొప్ప పని మరేదీ ఉండదని....హైరిస్క్ గల గర్భిణులు,బాలింతలు ఆసుపత్రికి వెళ్ళేందుకు నిరాకరిస్తే స్థానిక తహశీల్దార్ సహాయంతో ఆసుపత్రిలో సంబంధిత వైద్యాధికారి చేర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.రకరకాల పారామీటర్స్ లో కేసులు వస్తాయని, ఏయే కేసుకు ఏ విధమైన ట్రీట్ మెంట్ చేయాలో ఒక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. తద్వారా ప్రసూతి మరణాలను తగ్గించవచ్చని అన్నారు. ఆశా, ఏఎన్ఎం లు క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించి, వారి పరిధిలో ఉన్న గర్భవతులకు ఎలాంటి లక్షణాలు వచ్చినా వారిని అప్రమత్తం చేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత మెడికల్ ఆఫీసర్ కు నివేదించేలా చూడాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతీ ఆరోగ్య కేంద్రం పరిధిలో క్రమం తప్పకుండా ఏఎన్సీ చెకప్ లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.శిశు మరణాలపై సమగ్ర సమాచారం తెప్పించుకుని తదుపరి సమావేశంలో కూలంకషంగా చర్చిద్దామని జిల్లా కలెక్టర్ వైద్యులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రజిత,జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఐఎంఏ సభ్యులు, ప్రోగ్రాం అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం లు, ఆశా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు