హుజూర్ నగర్ పెట్రోల్ బంకులో కల్తీ

హుజూర్ నగర్ పెట్రోల్ బంకులో కల్తీ

 హుజూర్ నగర్, టౌన్ ,ముద్ర: హుజూర్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోపి అనే యువకుడు శనివారం ఉదయం లింగగిరి రోడ్డు లోని ఎస్సార్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో బంకు నుండి పెట్రోల్ బదులు నీళ్లు రావడంతో బాధితుడు పెట్రోల్ బంక్ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంకులో పెట్రోల్ కల్తీ చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాదించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బంకు యజమాని, బాధితుడు గోపిని దూషించడంతో, గోపి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

దీంతో అంబేద్కర్ కాలనీకి చెందిన 100 మంది యువకులు బంకు వద్దకు వచ్చి బంకు యజమానిని మందలించి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరించారు. కాగా గత కొద్ది రోజులుగా కల్తీ పెట్రోల్ అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు గ్రామానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో బంకు యజమాని జరిగిన నష్టానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.