బీజేపీలో  నా ప‌ట్ల ఎటువంటి  వివక్ష,  వివాదాలు లేనే లేవు

బీజేపీలో  నా ప‌ట్ల ఎటువంటి  వివక్ష,  వివాదాలు లేనే లేవు

బిజెపిలో త‌న‌ప‌ట్ల ఎటువంటి  వివక్ష,  వివాదాలు లేనే లేవ‌ని, ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ చేరిక‌ల క‌మిటీ  చైర్మన్​  ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో తాను ఇమడలేకపోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఒక పార్టీలో సుదీర్ఘకాలం, కీలక హోదాల్లో పనిచేసిన ఓ నాయకుడు కొత్త పార్టీలో చేరితే చిన్ని చిన్న సమస్యలు ఎదురవ్వడం సహజమేనన్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుపోవడానికి సమయం వుంటుందని ఏ పార్టీలోనైనా ఇది సహజమని ఈటల స్పష్టం చేశారు. వేరే పార్టీల నుంచి వచ్చే నేతల అనుభవాన్ని పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలన్నదే బీజేపీ పెద్దల ఉద్దేశ్యమన్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తప్పకుండా తమ వ్యక్తిగత పెరుగుదలను కూడా కోరుకుంటారని రాజేందర్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో నేతలు పార్టీ మారినప్పుడు ఎంపీపీ పదవిని ఆశించడం తప్పు కాదని, అలాగే నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యే పదవి కోరుకుంటారని చెప్పారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ పార్టీలోనైనా ఇది సహజమేనని అన్నారు. కానీ తాను తన జీవితంలో ఏనాడూ పదవి కావాలని నోరు తెరిచి అడగలేదని.. ఇకపైనా అడగనని రాజేందర్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనేది పార్టీ పెద్దల ఇష్టమన్నారు. వారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని.. తనకు చేరికల కమిటీ బాధ్యతలు ఇవ్వగా రాష్ట్రంలోని పలువురు నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించానని రాజేందర్ తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో రాష్ట్రంలోని జరిగే విషయాలను కళ్లతో చూస్తూ , చెవులతో వింటూ నిర్ణయాలుంటాయని తెలిపారు. జాతీయ పార్టీలు దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రాలలో జరిగే విషయాలను వినడమే తప్పించి  చూడలేవన్నారు. అందుకే జాతీయ పార్టీల్లో వున్న వారు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.