అమృతా ఫడణవీస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి.. రూ.10కోట్లు డిమాండ్‌..!

అమృతా ఫడణవీస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి.. రూ.10కోట్లు డిమాండ్‌..!

ముంబయి: మహారాష్ట్ర  ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతాకు రూ.  కోటి ఇవ్వజూపిన డిజైనర్‌ అనిక్ష  జైసింఘానీ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేసేందుకు తొలుత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన అనిక్ష.. అది కుదరకపోవడంతో అమృతా ఫడణవీస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే అమృతకు చెందిన కొన్ని వీడియోలను వైరల్‌ చేస్తానని ఆ డిజైనర్‌ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై తాజాగా బలవంతపు వసూళ్ల   కేసు నమోదు చేశారు.  అనిక్షపై ఇప్పటికే అమృతా ఫడణవీస్‌ బ్లాక్‌మెయిల్‌ , బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె తన తండ్రి అనిల్‌ జైసింఘానీకి సంబంధించిన క్రిమినల్‌ కేసులను మాఫీ చేయించేందుకు రూ.కోటి ఇవ్వజూపిందని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఇందుకు అమృత అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైన రెండు రోజుల తర్వాత ఆ డిజైనర్‌.. అమృతకు రెండు వీడియోలను పంపింది. ఆ వీడియోల్లో డబ్బు ఉన్న బ్యాగును అమృత కు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్ చేస్తానని ఆమె అమృతను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియోలను పరిశీలించగా.. అవి మార్ఫింగ్‌ చేసినవిగా తేలినట్లు పేర్కన్నారు. దీంతో ఆ డిజైనర్‌పై బలవంతపు వసూళ్లకు యత్నించినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోలను రూపొందించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.