ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్, పదవ తరగతి పరీక్షలు  పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఇంటర్, పదవ  తరగతి పరీక్షల  నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి  సంబంధిత శాఖల అధికారులతో  సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుండి ఇంటర్మీడియట్, ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలు జరిగే సమయంలో అత్యంత జాగరూకతతో ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

 
ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై  సమీక్షిస్తూ జిల్లాలో 13,616 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో   మొదటి సంవత్సరంలో  6,999 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 6,617  మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారన్నారు. ఇందుకోసం 31 కేంద్రాలలో    ప్రతి కేంద్రంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు , 31 మంది శాఖాధికారులతో  పాటు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 5 కస్టడీయ్సన్   టీములు ఏర్పాటు చేశామని వీరు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారన్నారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 14  పాయింట్లు ఏర్పాటు చేశామని   తెలిపారు. ఏప్రిల్ 3 నుండి 13వ తేదీ వరకు జరుగు పదవ  తరగతి పరీక్షలకు 10,700 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం ఏ.బి.సి. సెంటర్లుగా పట్టణ పరిధిలో, పోలీస్ స్టేషన్ 8 కిలో మీటర్ల పరిధిలో, మిగతా ప్రాంతాలలో  69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 16  పాయింట్లు ఏర్పాటు చేశామని   తెలిపారు. సి.సి.కెమెరాల  నిఘాలో నిర్వహించే పరీక్షలకు 3 ఫ్లైయింగ్ బృందాలు, 17 సిటింగ్ స్క్వాడ్, 19 కస్టోడియన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  


   పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు  పోలీస్ శాఖ  ప్రశ్న ప్రత్రాల స్టోరేజి, తరలింపు లో, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి  బందోబస్తు ఏర్పాటు చేయాలని,  తహశీలుదార్లు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా  చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో  మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ లో అంటారాయం కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను  ఆదేశించారు. పోస్టల్ శాఖ జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకొనీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని  సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీరు,  ఫాన్స్,  టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేసి సమీపంలోని  కలెక్టింగ్ పాయింట్ లో డిపాజిట్ చేయాలనీ, తమ కార్యాలయంలో  కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని డీఈఓ, ఇంటర్మీడియట్ అధికారులకు సూచించారు. 


ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, డీఈఓ రాధాకిషన్, రామేశ్వర్ రావు, జిల్లా సైన్స్ అధికారి రాజీ రెడ్డి, విద్యుత్ ఎస్ఈ శ్రీకాంత్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నవీన్ , పొలీసు, పోస్టల్,ఆర్.టి.సి. తదితర శాఖల అధికారులు  పాల్గొన్నారు