బీ అలర్ట్ - అయోధ్య రామయ్య పేరుతో మోసాలు

బీ అలర్ట్ - అయోధ్య రామయ్య పేరుతో మోసాలు

ముద్ర, సెంట్రల్ డెస్క్:- మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి ద్రుష్టి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామమందిరంపైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది. ఇప్పుడున్న ఈ మహా ఘట్టాన్ని సైబర్ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తాజాగా సైబర్ నేరాలపై అలర్ట్ ప్రకటించారు.

ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్ లను, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకల లైవ్, రామమందిర విశేషాలు,రామ మందిర డొనేషన్స్ అంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్ లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే లింక్ లను తెలియక ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని  పోలీస్ వర్గాలు అంటున్నారు.