నేటి నుండి జిల్లాలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి

నేటి నుండి జిల్లాలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి
  • ఎన్నికల ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు సమీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
  • ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి- జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి 

సిరిసిల్ల టౌన్, ముద్ర:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈనెల 9 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో   ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలలో ఉంటుందన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్, నిబంధనలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పాత్రికేయుల సమావేశంలో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి న‌వంబ‌ర్ 3వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. న‌వంబ‌ర్ 3వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ, న‌వంబ‌ర్ 13న స్క్రూట్నీ నిర్వ‌హించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 15. న‌వంబ‌ర్ 30వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించి, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన  నియమావళిని నిక్కచ్చిగా అమలు చేసేందుకు సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సమీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 1950 నెంబర్,  కంట్రోల్ రూమ్, ఎన్ జిఆర్ఎస్, సి- విజిల్ కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పొలిటికల్ ఫంక్షనరీ ల ఫోటో లను 24 గంటల్లోగా, ప్రభుత్వ స్థలాలు స్థలాలలో ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను, గోడలపై రాతలను 48 గంటల లోగా తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రవర్త నియమావళిని ప్రభావంతంగా అమలు చేసేందుకు ప్లయింగ్ స్క్వార్డులు, ఎస్ఎస్టి,  విఎస్ టి, ఎంసీఎంసీ టీంలను ఇప్పటికే క్రియాశీలకం చేశామన్నారు.  ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 171 ( బి) ప్రకారం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. 171 (సి) ప్రకారం ఓటర్లను బెదిరించడం నేరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. సెక్షన్ 171 (ఏ) ప్రకారం ప్రచార పోస్టర్లు, కరపత్రాలు ముద్రించే ప్రింటింగ్ సంస్థలు కచ్చితంగా వాటిపై ప్రింటర్ పేరు పబ్లిషర్ పేరు, మొబైల్ నెంబర్ ను విధిగా ప్రచురించాలన్నారు. అలా చేయని పక్షంలో బాధ్యులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ ల స్వీకరణ కు 10 రోజుల ముందు వరకు అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశం అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని ప్రజలు మీడియా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తమవంతు సహకారం అందిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు తప్పవని తద్వారా భవిష్యత్తులో వారికి ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. మంగళవారం నుండి జిల్లాలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరు కూడా తప్పుడు ఫేక్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేయవద్దని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఫేక్ మెసేజ్ లను ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే సంబంధిత వ్యక్తులపైన కాకుండా అడ్మిన్ పై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.