ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఫుట్‌పాత్‌పై పడుకున్న మోహన్ మాఝీ... ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి

ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఫుట్‌పాత్‌పై పడుకున్న మోహన్ మాఝీ... ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి

నేడు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోహన్ చరణ్ మాఝీ ఒకప్పుడు ఫుట్‌పాత్‌లపై పడుకున్నారు. మోహన్ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేసేవారు. మోహన్ ఓ రైతు. ఆరెస్సెస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ తర్వాత సర్పంచ్‌గా గెలిచారు. ఆదివాసీ హక్కుల న్యాయవాది, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటయోధుడిగా పేరుగాంచారు. కియోంజర్ నుంచి మోహన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కియోంఝర్ సదర్ ప్రాంతంలోని రాయికాలా ప్రాంతంలో మోహన్ మాఝీ పెరిగారు. అతను సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే లా చదివారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా ఉన్న మోహన్... అదే ఏడాది ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఆదివాసీ మోర్చా కార్యదర్శిగా పని చేశారు. 2019లో పార్టీ చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2009 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ విప్‌గా పని చేశారు.

2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నాడు సంచలనంగా మారాయి. తనకు ప్రభుత్వం క్వార్టర్‌ను కేటాయించడంలో ఆలస్యం చేయడం వల్ల తాను ఎన్నో రాత్రులు ఫుట్‌పాత్‌పై గడపాల్సి వచ్చిందని ఆరోపించారు. తాను ఫుట్‌పాత్‌పై పడుకున్న సమయంలో తన మొబైల్ ఫోన్ కూడా దొంగిలించబడిందని నాటి స్పీకర్ ఎస్ఎన్ పాత్రో దృష్టికి ఆయన అసెంబ్లీ వేదికగా తీసుకువెళ్లారు.