లింగంపల్లిలో 'ఫ్లెక్సీల'లొల్లి.. కడియం ఫ్లెక్సీల చించివేత

లింగంపల్లిలో 'ఫ్లెక్సీల'లొల్లి.. కడియం ఫ్లెక్సీల చించివేత

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: లింగంపల్లిలో ఫ్లెక్సీల లొల్లి జరిగింది. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారేసరికి చించి వేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లిలో బొడ్రాయి (గ్రామ దేవతల) ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 7 నుండి 10వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో రాజకీయ ప్రమేయం ఉండొద్దని తీర్మానించుకున్నట్లు తెలుస్తుంది. బొడ్రాయి ప్రతిష్ట కోసం రాజకీయ నాయకులు, అధికారులను విరాళాలు అడగొద్దని ఉత్సవాల సందర్భంగా వారిని గ్రామానికి ఆహ్వానించొద్దని ఉత్సవ కమిటీ తీర్మాంచినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కడియం వర్గానికి చెందిన నాయకులు శుక్రవారం గ్రామ దేవతలు (బొడ్రాయి) ప్రతిష్టోత్సవం జరగనున్న నేపథ్యంలో గ్రామ ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆహ్వానం పలికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది గమనించిన కొందరు కమిటీ తీర్మానానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలను చించి వేశారు. దీనితో గ్రామంలో ఫ్లెక్సీల చించివేత చర్చనీ అంశంగా మారింది.